బతుకమ్మకు అరుదైన గౌరవం.. జార్జియాలో పండుగ వారంగా గుర్తింపు.. గవర్నర్ ఆదేశాలు
- October 29, 2023
అట్లాంటా: తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. జార్జియాలో బతుకమ్మ పండుగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి కెంప్ ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ 3వ వారాన్ని (15-23) బతుకమ్మ వారంగా ప్రకటించారు. జార్జియా రాష్ట్రానికి, అమెరికాకు తెలంగాణ ప్రజలు అందిస్తున్న సహకారానికి గానూ ఈ గుర్తింపును ఇస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ ప్రకటనపై తెలంగాణ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ప్రతియేటా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ ఏడాది 15 నుంచి 23 వరకు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో వైభవంగా పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ సంబరాలు యేటా పెతర అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగ్గుస్తాయి. ఈ నేపథ్యంలో జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ జార్జియా గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. భారత సంస్కృతీ, సంప్రదాయాలకు ఈ పండుగ నిదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రజలతో తెలంగాణ వాసులు మమేకమై, జార్జియా వృద్ధికి పాటుపడుతున్న తీరునూ గవర్నర్ ప్రశంసించారు.

బతుకమ్మ వారంగా గుర్తించిన సంబంధిత పత్రాన్ని జార్జియా సీనియర్ రిపబ్లికన్ రితేష్ దేశాయ్ బాపూ రెడ్డి, డాక్టర్ నందినీ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. పత్రాన్ని అందుకున్న వారిలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పర్స, అధ్యక్షుడు జనార్ధన్ పన్నెల, డా. శ్రీని గంగసాని, వైస్ చైర్మన్ జర్నలిస్ట్ రవి పోనంగి ఉన్నారు. జీటీఏ ఆధ్వర్యంలో అక్టోబర్ 21న డెన్మార్క్ హైస్కూల్ వేదికగా బతుకమ్మ సంబురాల్లో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి జాన్స్ క్రీక్, సిటీ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి, దిలీప్ టుంకి హాజరయ్యారు.
ఇక బతుకమ్మ పండుగకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల ప్రముఖ జర్నలిస్ట్ రవి పోనంగి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పూర్తిగా వెనుక ఫౌండేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కీర్తిశేషులు జీఎస్ రెడ్డి, కీర్తి శేషులు జగన్ మోహన్ రావు, నరేందర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, డా. సత్యనారాయణ రెడ్డి, బాల ఇందుర్తి, కరుణాకర్ అసిరెడ్డికి దక్కుతుందని తెలిపారు. చివరి రోజైన అక్టోబర్ 22వ తారీఖున జీటీఏ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వేల మంది మహిళలు ఒకచోట చేరి సద్దుల బతుకమ్మను తీరొక్క పూలతో అలంకరించారు. గౌరీ దేవీని భక్తితో కొలిచారు. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన వారికి సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఇదే విధంగా జార్జియాలో ప్రతియేటా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







