కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

- November 17, 2023 , by Maagulf
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆమె.. హస్తం గూటికి చేరారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విజయశాంతి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరారు. విజయశాంతికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ విజయశాంతి బీజేపీకి బిగ్ షాక్‌ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపారు. 2020లో విజయశాంతి బీజేపీలో చేరారు.

కొంతకాలంగా విజయశాంతి బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తరుచుగా సోషల్ మీడియా వేదికగా బీజేపీ వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. బీజేపీలో కొన్ని రోజులుగా మౌనపాత్ర పోషిస్తున్నారు విజయశాంతి. హైకమాండ్ నిర్ణయాలు, అభిప్రాయాలు నచ్చక పార్టీ కార్యక్రమాలు, పొలిటికల్ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇక, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో విజయశాంతి పార్టీ మారతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. చివరికి అదే జరిగింది. ఆమె బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పటికే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

1998లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు విజయశాంతి. ఓవైపు సినిమాల్లో నటిస్తుండగానే రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2005లో సొంతంగా పార్టీ పెట్టారు. తల్లి తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 2009లో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారామె. అటుపై మెదక్ లోక్ సభ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి 2014లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అక్కడ కూడా ఇమడలేకపోయిన విజయశాంతి తిరిగి 2020లో బీజేపీలో చేరారు. మూడేళ్లు పార్టీలో కొనసాగిన విజయశాంతి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com