నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- December 19, 2023
తెలంగాణ: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గతనెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కోచోటకు తీసుకెళ్లి హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసును పలు కోణాల్లో పోలీసులు విచారణ చేయగా సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పట్టుకొన్నారు. నిందితుడ్ని విచారించగా విస్తుపోయో విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఆరుగురిలో నలుగురి మృతదేహాలు మాత్రమే పోలీసులు గుర్తించారు. మరో రెండు మృతదేహాల ఆచూకీ లభించలేదు. ప్రసాద్ తల్లి సుశీల క్షేమంగా ఉంది. అయితే, ఈ కేసులో సీరియల్ కిల్లర్ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఈ కేసుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్యలు సినీఫక్కీలో జరిగాయి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రానికి చెందిన ప్రసాద్ కుటుంబం కొన్ని సమస్యలతో ఊరును వదిలి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. ప్రసాద్ కు భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. భార్య గర్భంతో ఉంది. ఆయనతో తల్లి, ఇద్దరు చెల్లెళ్లు కూడా ఉండేవారు. ప్రసాద్ కు తన స్వగ్రామానికి చెందిన ప్రశాంత్ మిత్రుడు. ప్రసాద్ ఇల్లు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ కు తెలిపాడు. ఇల్లు నేనేకొంటానని ముందు కొంత డబ్బు ఇస్తానని ప్రసాద్ కు తెలిపాడు. ముందు కొంత డబ్బు ఇచ్చి ఇల్లు తనపేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని, బ్యాంక్ లోన్ ద్వారా మిగిలిన డబ్బు ఇస్తానని ప్రసాద్ కు ప్రశాంత్ చెప్పాడు. దీంతో ఇంటిని ప్రశాంత్ పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. కొద్దికాలం వరకు వేచిచూసినా ప్రశాంత్ డబ్బులు ఇవ్వకపోవటంతో ప్రసాద్ ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ వివాదం తరువాత ప్రసాద్ అడ్డును తొలగించుకోవాలని ప్రశాంత్ భావించాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు.
గత నెల 28న ప్రసాద్ ను నమ్మించి తీసుకెళ్లిన నిందితుడు డిచ్ పల్లి ప్రాంతంలో హత్యచేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. రెండురోజుల తరువాత ప్రసాద్ భార్యను నమ్మించి తీసుకెళ్లి బాసరలో హతమార్చి మృతదేహాన్ని గోదావరిలో తోసేశాడు. ఈనెల 9న ఇద్దరు కవల పిల్లలను తీసుకెళ్లి బాల్కొండ సమీపంలోని సోనో బ్రిడ్జి వద్ద హతమార్చాడు. ప్రసాద్ చెల్లెలు స్వల్పను మెదక్ జిల్లా చేగుంట వడియరం సమీపంలో కల్వర్టు వద్ద హత్య చేశాడు. చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి వద్ద హత్యచేసి శవాన్ని తగులబెట్టాడు.
అయితే, భూంపల్లి శివారులో ఈనెల 13న గుర్తు తెలియని యువతి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా పాదాలు కాలకుండా ఉన్నాయి.. కాళ్లకు పట్టీలు ఉన్నాయి. దీంతో మృతదేహం యువతిదిగా భావించి పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి భూంపల్లి శివారులో హత్యజరిగిన రోజు ఎవరు వెళ్లారనే విషయాన్ని గుర్తించారు. దీంతో నిందితుడి ఆనవాళ్లు దొరకడంతో అదుపులోకి తసుకొని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో సీరియల్ కిల్లర్ సహా ఐదుగురు నిందితులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









