అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు

- December 29, 2023 , by Maagulf
అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు

అయోధ్య:  పవిత్ర అయోధ్య నగరంలో కొత్తగా ప్రారంభించనున్న విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అని పేరు పెట్టినట్లు విమాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈ కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలా 6,500 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1450కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయం మొదటి దశ పూర్తి చేశారు.

శ్రీరాముడి ఆలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. భగవాన్ శ్రీరాం పెయింటింగులతో ఈ విమానాశ్రయ భవనాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య ధాం విమానాశ్రయంలో ఎల్ఈడీ లైట్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ల్యాండ్ స్కేపింగ్, ఫౌంటెన్లు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు.

ఈ అయోధ్య విమానాశ్రయం ప్రారంభంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందటంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ విమానాశ్రయం ప్రారంభంతోపాటు రూ.2,180 కోట్లతో అయోధ్య విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ టౌన్ షిప్ కార్యక్రమానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని మోదీ అయోధ్య రాక సందర్భంగా రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. అయోధ్య నగరంలో రామాలయం ప్రారంభం నేపథ్యంలో అభివృద్ధి పనులు చకా చకా సాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com