మహిళలకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త..

- January 25, 2024 , by Maagulf
మహిళలకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త..

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్‌ పార్టీ.

దీనిలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం, ఆరోగ్య శ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం చేసింది. ఇక వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఆరు గ్యారెంటీల అమలు కోసం.. ఇప్పటికే దరఖాస్తు ఫారాలు తీసుకుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ప్రస్తుతం డేటా ఎంట్రీ ప్రాసెస్‌ జరుగుతోంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణం కల్పించింది. ఇక ఈ నెలఖారులోగా మహిళలకు సంబంధించి మరో కీలక హామీ అమలుకు రెడీ అవుతోంది రేవంత్‌ సర్కార్‌. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జనవరి నెలాఖరులోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని భావిస్తోంది రేవంత్‌ సర్కార్‌.

నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రెడీ అవుతోందట. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారట. కచ్చితంగా జనవరి నెలాఖరులో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని ప్రాంరభించాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోందట. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆర్థక శాఖతో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో రూ.2,500 జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలే అమల్లో ఉన్నాయి. దీంతో ఆ పథకాలపై అధ్యయం చేసి, ఎంత ఖర్చు అవుతుందో తెలపాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు సమాచారం. ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తుల ఆధారంగా.. మహాలక్ష్మి పథకానికి లబ్దిదారులను ఎంపిక చేసి.. వారికి నెలకు రూ.2,500 ఇచ్చే పథకాన్ని అమలు చేయబోతోంది రేవంత్‌రెడ్డి సర్కార్‌.

ఇదే కాక మిగిలిన పథకాలను కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఒకవేళ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే.. పథకాల అమలు ఆలస్యమవుతుంది. అదే జరిగితే.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్‌ సర్కార్‌ ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అలానే 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫి​కేషన్‌ వెలువడేలోపే పథకాలను అమలు చేస్తే.. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుందని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. అందుకే వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పడమే కాక.. ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com