హైదరాబాద్-శ్రీశైలం రూట్లో తొలిసారిగా 10 ఏసీ రాజధాని సర్వీసులు
- February 10, 2024మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్ ప్రెస్ బస్సులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం
తెలంగాణ: మహాలక్ష్మి పథకం అమలు వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేసింది. అందులో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులున్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ.. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించింది.
హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాం వద్ద శనివారం 100 కొత్త బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన 60 రోజుల వ్యవధిలోనే 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగా.. అందుకు సంబంధించిన రూ.535 కోట్ల చెక్ ను మహిళలతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కు ముఖ్యమంత్రి అందజేశారు.
అంతకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతోనే మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా తొలి ప్రభుత్వ హామీని అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని అన్నారు. ప్రకటించిన 48 గంటల్లోనే పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల రోజుకు సగటున రూ.13 కోట్లు, ప్రతి నెల రూ.300 నుంచి 400 కోట్లు భారం పడుతున్నా.. వెనకడుగు వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.
కొత్తగా అందుబాటులోకి వస్తోన్న ఈ 100 బస్సుల్లో.. 90 ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయని, ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడతాయన్నారు. అలాగే, శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.
ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిలను పరిష్కరించేందుకు రూ.280 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా 2200 కొత్త బస్సులకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కోరారు. కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ప్రతి ఆర్టీసీ బస్సు నిండుగా తిరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహాలక్ష్మి అమలుకయ్యే నిధులను ఎప్పటికప్పడు టీఎస్ఆర్టీసీకి చెల్లిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ సిబ్బంది అద్భుతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్