ఇజ్రాయెల్ విధానాలతోనే ‘పాలస్తీనా’ సమస్య జఠిలం: సౌదీ అరేబియా

- February 22, 2024 , by Maagulf
ఇజ్రాయెల్ విధానాలతోనే ‘పాలస్తీనా’ సమస్య జఠిలం: సౌదీ అరేబియా

హేగ్: పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణను బేషరతుగా, తక్షణమే ముగించాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తూ, సౌదీ అరేబియా నెదర్లాండ్స్‌లోని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) లో తన వాదనలను వినిపించింది. 1967 నుండి ఇజ్రాయెల్ తీరుతో పాలస్తీనా రాజ్య స్థాపన అసాధ్యంగా మారిందన్నారు. నెదర్లాండ్స్‌లోని సౌదీ రాయబారి జియాద్ అల్-అత్తియా ICJలో మాట్లాడారు.  తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత భూభాగాల్లో ఇజ్రాయెల్ విధానాలతో వివాదం తలెత్తిందన్నారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణను మరియు పాలస్తీనియన్లపై పెరుగుతున్న హింసాత్మక చర్యలను అల్-అత్తియా తీవ్రంగా ఖండించారు. గాజా స్ట్రిప్‌లో క్రూరమైన, చట్టవిరుద్ధమైన యుద్ధం ఫలితంగా పాలస్తీనా పౌరుల భయంకరమైన హత్యలు, విధ్వంసం గురించి బలమైన వాదనలను వినిపించారు. ఇప్పటికే 2.3 మిలియన్ల పాలస్తీనియన్లు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని పేర్కొన్నారు. వెస్ట్ బ్యాంక్‌లో 279 కంటే ఎక్కువ అక్రమ స్థావరాలను నిర్మించడం ద్వారా, తూర్పు జెరూసలేంను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ వివాదానికి తెరలేపిందని అల్-అత్తియా చెప్పారు. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడం, సహజ వనరులను కబ్జా చేయడంతో వివాదం సద్దుమణగడం లేదని పేర్కొన్నారు.  పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించాలని, అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించడాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలు సహకరించాలని రాయబారి కోర్టును కోరారు. ఫిబ్రవరి 19న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనున్న తూర్పు జెరూసలేంతో సహా ఆక్రమిత భూభాగాల్లో ఇజ్రాయెల్ తీరుపై ICJలో పబ్లిక్ హియరింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com