యే దోస్తీ హమ్ నహీ తోడేంగే.. అంటున్నా బరాక్ ఒబామా

- June 06, 2016 , by Maagulf
యే దోస్తీ హమ్ నహీ తోడేంగే.. అంటున్నా  బరాక్ ఒబామా

యే దోస్తీ హమ్ నహీ తోడేంగే.. అంటున్నారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మోదీ.. ఏడోసారి ఒబామాతో సమావేశం కానున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటికే ఆఫ్ఘన్, ఖతార్, స్విట్జర్లాండ్ పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ.. భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి వాషింగ్టన్ చేరుకోనున్నారు. అమెరికాను తమ సహజ భాగస్వామిగా పేర్కొన్న మోదీ.. రెండు దేశాల బంధం బలపడటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఓవల్ కార్యాలయంలో ఒబామాతో ద్వైపాక్షిక చర్చలతోపాటు వైట్‌హౌజ్‌లో విందు ఆరగించనున్నారు ప్రధాని మోదీ.2014 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు మోదీ, ఒబామా ఆరుసార్లు కలుసుకోగా, ఇద్దరి మధ్యా లెక్కలేనన్ని ఫోన్‌కాల్స్ నడిచాయని ఆ ప్రకటన పేర్కొంది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీతోపాటు ఇండోపసిఫిక్ రీజియన్‌లో భద్రత, దౌత్యపరమైన సహకారం, స్థిరమైన ఆర్థికాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. పర్యటనలో భాగంగా మోదీ కాంగ్రెస్ రెండు సభల్లోనూ ప్రసంగించే అరుదైన గౌరవాన్ని మోదీ పొందనున్నారు. వచ్చే జనవరితో ఒబామా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మోదీతో ఆయనకు ఇదే చివరి భేటీ కానుంది. భేటీలో భాగంగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్‌ఎస్‌జీ)లో భాగస్వామి కావడానికి భారత్ చేసుకున్న దరఖాస్తుపై కూడా చర్చించనున్నారు. ఎన్‌ఎస్‌జీతోపాటు ఆస్ట్రేలియా గ్రూప్, వాసెనార్ అరేంజ్‌మెంట్, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ (ఎంటీసీఆర్) గ్రూపులలో భారత్ భాగస్వామ్యాన్ని ఒబామా ప్రభుత్వం బలంగా కోరుకుంటోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఎంటీసీఆర్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల హైటెక్ మిస్సైల్స్‌ను భారత్ ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం దక్కుతుంది. అంతేకాదు ప్రిడేటర్ డ్రోన్స్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పర్యటనలో భాగంగా అమెరికా చట్టప్రతినిధులతోనూ మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com