ప్రపంచ హోమియోపతి దినోత్సవం

- April 10, 2024 , by Maagulf
ప్రపంచ హోమియోపతి దినోత్సవం

హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి.ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా పొందడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా  అల్లోపతి , ఆయుర్వేద, యునాని, యోగా, నేచురోపతి, సిద్ధ, హోమియోపతి లాంటి పలు రకాలైన వైద్యవిధానాలు ప్రజారోగ్య పరిరక్షణలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. హోమియోపతి వైద్యాన్ని డబ్ల్యుహెచ్‌ఓ రెండవ అతి పెద్ద వైద్య విధానంగా గుర్తించింది.

 ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 10‌న ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’’ జరుపుకుంటారు. ఆ రోజు హోమియో వైద్య పితామహుడు డా.శామ్యూల్ హనీమాన్‌ పుట్టినరోజు. ఈ రోజున హోమియోపతికి విశేష ప్రచారం కల్పించడం, ప్రజలలో అవగాహన పెంపొందించడం, హోమియోపతికి సంబంధించి ఎవరి దగ్గర ఎటువంటి కొత్త ఆలోచన ఉన్నా స్వీకరించడం, పరిశోధన జరపడం వంటివి హోమియోపతి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు.

భారతదేశంలో హోమియోపతి పద్ధతి దాదాపు రెండు వందల సంవత్సరాలకు పూర్వం నుండి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు, ఆధారాలు లేవనే చెప్పవచ్చు. హోమియో మందులు ఖరీదు తక్కువ. వైద్యుల ఫీజులూ తక్కువ కాబట్టి ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారికి అందుబాటులో ఉంటుంది. హోమియో మందులలో సైడు ఎఫెక్టస్ ఉం‌డవు లేదా తక్కువగా ఉంటాయి. ఈ మందులు ఎక్కువగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా పేద ప్రజల వైద్యంగా ముందుకు దూసుకు పోయింది.

ప్రపంచంలో ఎక్కువగా భారతదేశంలోనే ఆదరించబడుతున్నది. వైద్య కళాశాలలు, ఫార్మసీలు, రీసెర్చ్ సెంటర్లు, హాస్పిటల్స్ భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి.కఠిన దీర్ఘ వ్యాధులకు ఈ వైద్యంలో మంచి ఫలితాలున్నాయి. మెదడువాపు వ్యాధి, చికున్‌గున్యా, డెంగ్యూ, చికెన్‌పాక్స్, స్వైన్‌ఫ్లూ, మద్రాస్ ఐ (కళ్ల కలక), గవద వాపు, కలరా, అతిసార మొదలగు ఎన్నో అంటు వ్యాధులకు హోమియోపతి జవాబు. అంటువ్యాధులకు ముందు జాగ్రత్త చర్యలుగా హోమియోపతి మందులను వాడి వ్యాధులను ప్రబలకుండా నివారించవచ్చు.

సుమారు 100 దేశాలలో ఈ హోమియో వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచమంతటా ఏటా సుమారు 10000 కోట్ల రూపాయల హోమియో మందులు అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలో హోమియోపతి వైద్య మార్కెట్ సుమారు 70 వేల కోట్ల రూపాయలు.

వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌, ‌బ్యాక్టీరియాలు చనిపోతాయి. ఆ శక్తే బలహీనపడితే వైరస్‌ ‌తీవ్రమై శరీరం రోగగ్రస్తమవుతుంది. ఆ బాధను శరీరం కొన్ని లక్షణాల ద్వారా వ్యక్తం చేస్తుంది. 
ఆ లక్షణాల ఆధారంగా వ్యాధి తీవ్రత దాని మూలాలను గుర్తించి హోమియో చికిత్సలు పనిచేస్తాయి. ప్రస్తుతం అల్లోపతి వైద్య విధానానికి అధిక శాతం ప్రజలు మొగ్గు చూపుతున్నప్పటికీ అనాదిగా ఆచరణలో ఉన్న హోమియోపతి వైద్య విధానాన్ని  కూడా ప్రజలు నమ్ముతున్నారు. 

                                              --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com