బహుముఖ రాజకీయ ప్రజ్ఞాశాలి

- April 10, 2024 , by Maagulf
బహుముఖ రాజకీయ ప్రజ్ఞాశాలి

ఆయన నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రభుత్వాల్లో అనేక కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు.నెహ్రూ-గాంధీల కుటుంబానికి వీరవిధేయుడు. కానీ ఇందిరతో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి దూరమైనా, తోలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా భారతదేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. అతడే భారతదేశ రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌, పూర్తిపేరు మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్.నేడు మొరార్జీ దేశాయ్‌ వర్థంతి.  

మొరార్జీ దేశాయ్ 1896 ఫిబ్రవరి 29న గుజరాత్‌లోని భడేలిలో జన్మించారు. అతని తండ్రి పేరు రాంచోడ్జీ దేశాయ్, తల్లి పేరు మణిబెన్. తన చిన్నతనంలోనే  తండ్రి తనకు జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన పాఠాలు నేర్పించారని, తండ్రి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని మొరార్జీ దేశాయ్‌ అనేవారు. తనకు సర్వధర్మ సమభావన పై విశ్వాసం ఉందని చెప్పేవారు.కులమతాలకంటే మానవత్వమే ఉన్నతమైందని , మనిషి అన్ని పరిస్థితులలోనూ ఓర్పుగా ఉండాలని బోధించేవారు.

 మొరార్జీ దేశాయ్ కళాశాల జీవితంలోనే మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్.. తదితర కాంగ్రెస్ నేతల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారు. ఇవి అతని జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి.1930లో మొరార్జీ దేశాయ్ బ్రిటీష్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, స్వాతంత్ర పోరాటంలోకి దూకారు. 1931లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సర్దార్ పటేల్ సూచనల మేరకు అఖిల భారత యువజన కాంగ్రెస్ శాఖను స్థాపించి, దానికి అధ్యక్షుడయ్యాడు. 1932లో మొరార్జీ రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

దేశానికి స్వాతంత్ర వచ్చిన మొరార్జీ దేశాయ్ దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు.1952లో బొంబాయి (ప్రస్తుతం మహారాష్ట్ర) రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక, హోం శాఖలతో పాటుగా  అంటే 1967-69 వరకు ఉపప్రధానిగా పనిచేశారు.

1969లో కాంగ్రెస్‌లో చీలిక  ఏర్పడటంతో మొరార్జీ దేశాయ్ ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ)ని విడిచిపెట్టి కాంగ్రెస్ (ఓ)లో చేరారు. 1975లో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. లోక్ నాయక్  జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీలో చేరిన తర్వాత , 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ సమయంలో ప్రధానమంత్రి పదవికి చౌధరి చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్ పోటీదారులుగా నిలిచారు. అయితే జయప్రకాష్ నారాయణ్ ‘కింగ్ మేకర్’ పాత్రను సద్వినియోగం చేసుకుని మొరార్జీ దేశాయ్‌కి మద్దతుగా నిలిచారు. 1977, మార్చి 24న తన 81 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. 1979, జూలై 28 వరకు ఈ పదవిలో కొనసాగారు.
 
మొరార్జీ దేశాయ్‌ హిందీ, గుజరాతి, సంస్కృతం, మరాఠీ మరియు ఆంగ్ల భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ప్రకృతి వైద్యంలో కూడా అందవేసిన చెయ్యిగా ప్రసిద్ధి.

మొరార్జీ దేశాయ్‌  భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’, పొరుగు దేశమైన పాకిస్తాన్ నుండి ఉత్తమ పౌర పురస్కారం ‘తెహ్రీక్ ఈ పాకిస్తాన్’ పురస్కారాలను అందుకున్నారు.మొరార్జీ దేశాయ్‌ ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు. గాంధీజీ స్పూర్తితో రాజకీయాల్లోకి కారణంగా అయన భావజాలమైన గాంధేయవాదానికి మద్దతుదారుగా నిలిచారు. రాజకీయాల నుండి వైదొలిగిన తరువాత అయన ముంబైలోనే నివసిస్తూ  తన 99వ యేట 1995 ఏప్రిల్ 10 న మరణించారు. 

                                --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com