పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్

- May 10, 2024 , by Maagulf
పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్

న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సడెన్ గా వాతావరణం మారింది. గత మూడు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతూ వస్తున్నాయి. మరో మూడు రోజులపాటు రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్న వార్త రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెడుతుంది. గత నెల రోజులుగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తిండీ తిప్పలు మానేసి, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వారికి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అంతేకాదు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

తెలంగాణ లో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఈ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సరిగ్గా పోలింగ్ రోజున వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అసలే.. హైదరాబాద్ వంటి చోట్ల సాధారణ రోజుల్లోనే పోలింగ్ తక్కువగా నమోదవుతూ ఉంటుంది. అలాంటిది వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని బెంబేలెత్తుతున్నారు. ఇన్నాళ్లూ పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా అని భయపడుతున్నారు. చూద్దాం మరి ఆ రోజు వర్షం పడుతుందా లేదా అనేది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com