ఈవీఎంల పై జగన్ సంచలన ట్వీట్..

- June 18, 2024 , by Maagulf
ఈవీఎంల పై జగన్ సంచలన ట్వీట్..

అమరావతి: ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలపై సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్ లనే వాడుతున్నారు.. భారతదేశంలో కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లనే వాడాలని ట్వీట్ లో పేర్కొన్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కేవలం 11 అసెంబ్లీ నియోకవర్గాలను మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. ఎన్డీయే కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 164 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించి ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి పలువురు వైసీపీ నేతలు ఈవీఎంల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈవీఎం పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ వీడియోనుసైతం విడుదల చేశారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. జగన్ ట్వీట్ ప్రకారం.. న్యాయం జరగడమేకాదు.. జరిగినట్లు కనిపించాలి. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు.. మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని జగన్ అన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి.. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే దిశగా మనంకూడా పయనించాలని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంలపై చేసిన ట్వీట్ కు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఈవీఎంల పనితీరు బేష్ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టీటీడీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి.. 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు.. అంటూ ట్వీట్ లో టీడీపీ పేర్కొంది. జగన్ ట్వీట్ పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప.. ఓడిపోతే ఈవీఎంల తప్పా? అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచినప్పుడు ఈవీఎంల గురించి జగన్ ఏం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద.. ఆత్మస్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com