అసెంబ్లీలో చంద్రబాబు తన తోలి ప్రసంగంలో ఏమ్మన్నారంటే

- June 22, 2024 , by Maagulf
అసెంబ్లీలో చంద్రబాబు తన తోలి ప్రసంగంలో ఏమ్మన్నారంటే

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లు తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. గత ఐదేళ్లుగా శాసనసభలో జరిగిన సంఘటనలు చూసి బాధపడ్డానని అన్నారు.

గత సభలో అసెంబ్లీని వాకౌట్ చేసేటప్పుడు చేసిన ప్రకటనను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కౌరవ సభలో తాను ఉండబోనని, సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని గుర్తుచేశారు. తన కుటుంబ సభ్యులపై వైసీపీ సభ్యులు అమర్యాదగా మాట్లాడారని చంద్రబాబు గుర్తుచేశారు.

వైసీపీ పాలనలో ఎంతోమంది మహిళలు బాధపడ్డారని, గౌరవసభగా శాసనసభను నడిపిస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, రాష్ట్రంలో ఆడబిడ్డలకు వైసీపీ పాలనలో జరిగిన అవమానం ఇంకెప్పుడూ ఈ సభలో జరగకూడదని చంద్రబాబు అన్నారు. తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.

అవతలి పార్టీ సభ్యులను ఎగతాళి చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ సభ్యులను సభలో గౌరవించాలని అన్నారు. ‘‘గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని ఎగతాళిగా మాట్లాడారు.’’ అని గుర్తుచేశారు.

ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని, వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్వస్తి అని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్ట సభలు విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడని, ఆయన నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి విషయానికి వస్తే రాజధాని కట్టాలని, అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com