లోక్సభలో పవన్ పై ప్రశంసలు కురిపించిన ఎంపీ బాలశౌరి
- June 26, 2024
న్యూ ఢిల్లీ: లోక్సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు.ఆ పార్టీ తరపున లోక్సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఏపీలో ఉండగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన రెండు స్థానాల్లో పోటీచేసింది. కాకినాడ, మచిలీపట్నం నుంచి ఆ పార్టీ ఎంపీలు గెలిచారు. 18వ లోక్సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కాగా.. తొలిరోజే ఏపీకి చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు సోమవారం ప్రమాణం చేశారు.
బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లాకు జనసేన మద్దతు ప్రకటించింది. ఓంబిర్లా స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయనను అభినందిస్తూ అన్ని పార్టీల ఎంపీలు మాట్లాడారు. దీనిలో భాగంగా జనసేన నుంచి ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడారు. జనసేన తరపున ఆయన లోక్సభలో తొలి ప్రసంగం చేశారు. 2019లో బాలశౌరి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరి ఆ పార్టీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీచేసి గెలిచారు.
స్పీకర్గా ఎన్నికైనందుకు ఓంబిర్లాకు పవన్ కళ్యాణ్ తరపున, జనసేన పార్టీ తరపున బాలశౌరి శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీతో పాటు 140 కోట్ల ప్రజలు ఓంబిర్లా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించగలరనే పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. తాను జనసేన ఎంపీగా గెలవడం ద్వారా ఇక్కడ మాట్లాడగలుగుతున్నానని.. తనకు ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కు బాలశౌరి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో లోక్సభ వేదికగా పవన్పై ప్రశంసలు కురిపించారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ అన్నారు.ఎన్డీయే పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పవన్ అంటే తుపాన్ అని వర్ణించిన విషయాన్ని బాలశౌరి గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓ చరిత్ర సృష్టించారని తెలిపారు. స్వాతంత్య్ర భారతదేశంలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అన్నారు. పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లలో పోటీచేసి.. అన్ని స్థానాల్లో విజయం సాధించామన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







