అరుణాచలం వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

- July 14, 2024 , by Maagulf
అరుణాచలం వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

ఈ నెల 21వ తేదీన గురు పూర్ణిమ. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేద వ్యాసుడు గురు పౌర్ణమి నాడే జన్మించారని నమ్ముతారు.

అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. సమస్త మానవాళికి వేదాలను బోధించడం అనేది ఆయనతోనే ఆరంభమైనందు వల్ల ఆది గురువుగా పూజిస్తారు వ్యాస మహర్షిని.

గురువు ఆశీస్సులు మెండుగా ఉండాలనే సద్భావనతో ఇవ్వాళ గురుబ్రహ్మలను పూజిస్తారు. దీనివల్ల ఐశ్వర్యం, సుఖ శాంతులు లభిస్తాయని విశ్వసిస్తారు. వేదాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. హిందు సంప్రదాయాల ప్రకారం.. గురువు భగవంతుని కంటే కూడా ఉన్నతుడిగా పూజలందుకుంటాడు. వేద వ్యాసుడు బోధిస్తోండగా.. సాక్షాత్ వినాయకుడు మహా భారతాన్ని రాశాడని ప్రతీతి.

గురు పౌర్ణమి నాడు తమిళనాడులోని అరుణాచలానికి వెళ్తే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా పౌర్ణమినాడు అరుణాచలం గిరి ప్రదర్శనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది- గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణం చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి అరుణాచలానికి భారీగా తరలి వెళ్తుంటారు భక్తులు.

వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడిపించనుంది. అలాగే- ప్యాకేజీ ట్రిప్పులను ప్రవేశపెట్టింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబుబ్‌నగర్‌ జిల్లాల్లోని వివిధ డిపోల నుంచి ఈ బస్సులు బయలుదేరి వెళ్తాయి.

ఈ నెల 19వ తేది నుంచి 22వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్యాకేజీ ట్రిప్‌లో భాగంగా కాణిపాక వరసిద్ది వినాయక ఆలయం, శ్రీపురంలోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని భక్తులకు కల్పించింది. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ కోసం భక్తులు https://tsrtconline.inవెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com