వైద్య సేవా ధార్మికుడు - డా.కాసరనేని
- August 21, 2024
తెలుగునాట విద్య, వైద్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో విఖ్యాత సేవా వ్రతుడిగా ప్రసిద్ధి గాంచిన వ్యక్తి డాక్టర్ కాసరనేని సదాశివరావు. ఆయన వృత్తి వైద్యం అయినప్పటికీ ప్రవృత్తి సాహితీ పిసాస, రాజకీయ అభిలాష. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను పాటిస్తూనే గ్రామీణ ప్రజలపై ఆపేక్షతో, రైతాంగ హక్కుల కొరకై పోరాడారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి స్వశక్తితో ఎదిగిన సదాశివరావు పేదల డాక్టర్గా పేరు గడించారు.
డాక్టర్ కాసరనేని సదాశివరావు గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు శివారు రామచంద్రపాలెంలో జన్మించారు. స్వాతంత్ర సమరయోధుడు, తన మేనమామ పిన్నమనేని సూరయ్య ప్రోత్సాహంతో వైద్య విద్యను అభ్యసించారు. సర్జరీలో ఎంఎస్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తనతో పాటు విశాఖపట్టణం వైద్య కళాశాలలో చదువుకున్న కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ చలసాని జయప్రదాంబను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత 1951లో గుంటూరు సాంబశివ పేటలో ప్రజా వైద్యశాలను స్థాపించారు. అది పేరుకు మాత్రమే కాదు. ఆచరణలో కూడా ప్రజల వైద్యశాలగా స్థిరపడింది.
గ్రామీణ పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వైద్యులు పలు విధాల వారిని దోచుకునే రోజులవి. ఆ పరిస్థితుల్లో గ్రామీణ పేదల కష్టాన్ని దగ్గర నుంచి చూసిన నేపథ్యంలో వారికి ఉచిత వైద్యాన్ని అందించాలని సదాశివరావు నిర్ణయించుకున్నారు. జీవితాంతం ఆచరించి చూపారు. ప్రజా వైద్యశాల ప్రభుత్వ వైద్యశాలను మరిపించేది. నిరుపేదలైతే మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. అమాయకులు అయిన గ్రామీణ ప్రాంత రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఆయనకు ధనిక, పేద అనే తారతమ్యం లేదు. వైద్య పరీక్షలు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో రోగ నిర్ధారణ చేయడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. రోగుల కుటుంబాలకు ఆప్తుడుగా వ్యవహరించేవారు. రోగులపట్ల ఆయన చూపించిన వాత్సల్యమే వారిని సగం ఆరోగ్యవంతులను చేసేది.
సదాశివరావు యువ వైద్యులను ప్రోత్సహించేవారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన డాక్టర్లు ఏర్పాటు చేసుకున్న కొత్త ఆసుపత్రులను ఆయన తన చేతుల మీదుగా ప్రారంభించారు. దీనికి కారణం సదాశివరావు హస్త వాసిపై ఉన్న నమ్మకమే. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఆసుపత్రులు ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైద్య రంగాన్ని వ్యాపార దృష్టితో కాకుండా మానవతా దృక్పథంతో చూడాలని ఎప్పుడూ ఆయన చెబుతుండేవారు. ఈ తరం వైద్యులు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజంలో విలువలు, విశ్వసనీయత పెరుగుతాయి.
డాక్టర్ సదాశివరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, ఏకాగ్రత ఆయనలో మూర్తీభవించాయి ఆయన ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. అన్నింటికంటే సహృదయత, జాలి, దయ, దాతృత్వ స్ఫూర్తి ఆయనను ఉన్నత శిఖరాలపై నిలిపాయి. చదువులపై ఆయనకు ఉన్న అపారమైన ఆసక్తి వివిధ విద్యాసంస్థల అభివృద్ధికి బాటలు వేసేలా చేశాయి. చదువు లక్ష్యం సంపాదన కోసం కాదని, విద్య వివేకాన్ని, సృజనాత్మకతను, సంస్కారాన్ని అందించాలని తపించేవారు.
విద్యార్థి దశ నుంచే గ్రామీణ పేదలకు విద్యను అందించాలనే తపన ఆయనలో ఉండేది. విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలకు తనవంతు సహాయం అందించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి దానిని కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్దారు. సుదీర్ఘకాలం జేకేసీ కళాశాల పాలకవర్గంలో వివిధ హోదాల్లో పనిచేశారు. తన దార్శనికత, ముందుచూపుతో రాష్ట్రంలోనే దాన్ని ఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. సాంకేతిక విద్య అవసరాన్ని, ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్.వి.ఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపనలో, పాలకవర్గంలో పనిచేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా తీర్చిదిద్దారు.
తన సతీమణి జయప్రదాంబ పేరుతో ఒక కళాశాలను కూడా నెలకొల్పారు. స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీ నారాయణ దంపతులు స్థాపించిన శారదా నికేతన్కు సదాశివరావు దంపతులు వివిధ రూపాల్లో తమ సేవలను అందించారు. జాతిని సామాజికంగా, ఆర్థికంగా పురోగమన పథంలో నడిపించే శక్తి విద్య, విజ్ఞానానికి, నైపుణ్యానికి మాత్రమే ఉందని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. అందుకే విద్యా బోధనలో, విద్యా ప్రమాణాలలో ఎక్కడా రాజీపడేవారు కాదు. ఆంధ్రా, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో సిండికేట్, సెనేట్ సభ్యులుగా సేవలందించారు.
చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని సదాశివరావు బలంగా నమ్మేవారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన నియంతృత్వ పోకడలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ పాలనను నిరసించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న రైతు బాంధవుడు ఆచార్య రంగా అంటే ఎనలేని అభిమానం. చరణ్ సింగ్, జయప్రకాశ్ నారాయణ్ సూచనల మేరకు 1977లో జనతాపార్టీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కొత్త రఘురామయ్యపై గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి సదాశివరావు పోటీ చేశారు. అనంతరం 1980లో తన రాజకీయ గురువైన రంగాపై కూడా అదే స్థానం నుంచి పోటీ చేశారు. ఈ రెండు సార్లు ఓటమి పాలయ్యారు.
1982లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటైన తర్వాత ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పెదకూరపాడు నుంచి పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐదేళ్ళలో ఆ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. రైతుల కోసం అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారు. 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఓటమిపై ఎన్టీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంలో తన అభిప్రాయాలను సదాశివరావు నిర్మొహమాటంగా ఎన్టీఆర్ ముందుంచారు. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు గానీ సినీ యాక్టర్గా కాదని ఆయన సమక్షంలో చెప్పారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగే మహానాడు కార్యక్రమాన్ని వేసవిలో కాకుండా మరో ఋతువులో నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.
సాహిత్యం పట్ల సదాశివరావు గారికి ఎనలేని మక్కువ. ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఆయన బాగా చదివారు. పలువురు కవులు, రచయితలను ఒక వేదికపైకి తీసుకువచ్చారు. ప్రతి సందర్భంలోనూ ప్రజల ఆలోచనలతో మమేకమవుతూ వారి ఊహలకు, ఉద్వేగాలకు, అనుభూతులకు, అనుభవాలకు అద్దం పడుతూ ముందుకు నడిచారు. సాహితీ జగత్తులో ఒక నూతన వ్యవస్థ నిర్మాణం కోసం కృషిచేశారు.
గుర్రం జాషువాతో కలిసి సాహిత్య సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో తుమ్మల సీతారామమూర్తి, దివాకర్ల వెంకటావధాని, వానమామలై వరదాచార్యులు, ఉత్పల సత్యనారాయణ, కాళోజి నారాయణరావు, సి.నారాయణ రెడ్డి, నాయని కృష్ణ కుమారి, బి.వి. నరసింహారావు, షేక్ నాజర్, మరుపూరు కోదండరామిరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రాజన్న కవి, రామలక్ష్మి ఆరుద్ర, మాధవరాయ శర్మ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, నాగళ్ల గురుప్రసాదరావు, బేతవోలు రామబ్రహ్మం, ప్రసాదరాయ కులపతి మొదలైన సాహితీ దిగ్గజాలు పాల్గొనేవారు.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎటువంటి ప్రలోభాలకు రాజీ పడని విలువలతో కూడిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సదాశివరావు. హేతుబద్దమైన ఆలోచనలు, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్దత, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించారు. తెలుగుదనానికి సదాశివరావు నిలువెత్తు నిదర్శనం. మహోన్నత మానవత్వం, సమున్నత వ్యక్తిత్వం ఆయనది. సమాజంలో విలువలు, విశ్వసనీయతకు ప్రతిరూపంగా నిలిచారు. నీతి, నిజాయితీలే ఊపిరిగా శ్వాసించి, ధ్యాసించి ప్రజావైద్యునిగా, విద్యాదాతగా, కళాపోషకునిగా, రాజకీయవేత్తగా, సాహిత్యాభిమానిగా సమాజానికి డాక్టర్ గారు చేసిన సేవలు అజరామరం.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు