టాలీవుడ్ దర్శక దిగ్గజం....!
- October 05, 2024
తెర మీద ఏది చేసినా కొత్తగా చేయాలి, పాతదానినైనా కొత్తగా చూపాలి అనే ఆలోచనలు మెండుగా ఉన్న దర్శకులు గుత్తా రామినీడు. మొదటి నుంచీ థింక్ అవుటాఫ్ ద బాక్స్ అనే ధోరణితో సాగారు. మనసులు తాకేలా చిత్రాలను రూపొందించడమే కాదు, తన చిత్రాలలో మనోవిజ్ఞానశాస్త్రం విషయాలనూ చూపించారాయన. ఆయన తెరకెక్కించిన చిత్రాలు కొన్నే అయినా, ఈ నాటికీ ఆయనను తలచుకునేలా తెరకెక్కించారు. నేడు సుప్రసిద్ధ దిగ్గజ దర్శకులు గుత్తా రామినీడు జన్మదినం.
గుత్తా రామినీడు గారు 1927 అక్టోబర్ 5న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు తాలూకాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచి ఆయనకు పుస్తకాల పురుగు అనే పేరు ఉండేది. ఏది చదివినా, ఏది చూసినా దానిని మరోకోణంలో అయితే ఎలా ఉంటుందో ఆలోచించేవారు. కళలపట్ల ఎంతో అభిమానం గల ఆయన 1954లో చిత్రసీమలో ప్రవేశించారు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన పల్లెటూరు, చరణదాసివంటి చిత్రాలకు అసోసియేట్ దర్శకుడిగా పనిచేశారు.అలాగే, మరో దర్శక దిగ్గజం వేదాంతం రాఘవయ్య గారి వద్ద "అన్నదాత " సినిమాకు సహాయకుడుగా పనిచేశారు.
1959లో మా ఇంటి మహాలక్ష్మి చిత్రంతో దర్శకుడయ్యారు. హరనాథ్, జమున జంటగా నటించిన ఈ చిత్రం పూర్తిగా హైదరాబాద్ లో నిర్మితమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్రలో నిలచింది. బెంగాల్ లో ఘనవిజయం సాధించిన "దీప్ జ్వలే జాయ్" సినిమా ఆధారంగా తెలుగులో చివరకు మిగిలేది చిత్రం రూపొందించారు. ఇందులో సైకియాట్రిక్ హాస్పిటలో పనిచేసే ఓ నర్సు తమ దగ్గర చేరిన మానసిక రోగులకు చికిత్సలో భాగంగా ప్రేమను పంచుతుంది. మహానటి సావిత్రి ఇందులో నర్సు పాత్ర పోషించారు. తాను నటించిన అన్ని చిత్రాల్లోకి చివరకు మిగిలేది బెస్ట్ అని సావిత్రి పలుమార్లు చెప్పుకున్నారు.
1962లో రామినీడు దర్శకత్వంలో ఏయన్నార్ హీరోగా కలిమిలేములు రూపొందింది. అదీ ఆకట్టుకోలేక పోయింది.ఆ పై భానుమతి ప్రధాన పాత్రలో అనురాగం తెరకెక్కించారు రామినీడు. ఈ సినిమాతోనే ఫైనాన్సియర్ గా డి.రామానాయుడు చిత్రసీమలో అడుగుపెట్టారు. చిత్తూరు నాగయ్య మేటి చిత్రాలలో ఒకటిగా నిలచిన భక్త పోతన కథను రామినీడు తన కాలానికి అనుగుణంగా రూపొందించారు. రామినీడు భక్త పోతనలో గుమ్మడి టైటిల్ రోల్ పోషించగా, శ్రీనాథునిగా ఎస్వీఆర్ కనిపించారు. ఈ సినిమా పరాజయం చవిచూసింది.
రామినీడు పాత కథనైనా కొత్తగా చెప్పాలన్న ఉద్దేశంతో మరో పీరియడ్ ఫిలిమ్ పల్నాటి యుద్ధం తెరకెక్కించారు. 1966లో ఎన్టీఆర్ బ్రహ్మనాయునిగా, భానుమతి నాగమ్మగా రామినీడు పల్నాటియుద్ధం తెరకెక్కించారు. నిజానికి ఈ చిత్రంలోబ్రహ్మనాయునిగా ఎన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. పాట పల్నాటి యుద్ధం చిత్రంలో నాగమ్మగా నటించిన సీనియర్ నటీమణి కన్నాంబ గారితో భానుమతిని పోల్చి చూడగా, ప్రేక్షకులు మాత్రం కన్నాంబలాగా ఈమె చేయలేకపోయింది అన్నారు. పాత పల్నాటి యుద్ధం కంటే కొన్ని సన్నివేశాలు ఇందులోనే బాగా తెరకెక్కించారనీ ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంస పత్రం లభించింది.
ఆ తర్వాత అయన దర్శకత్వంలో బంగారు సంకెళ్ళు, మూగప్రేమ వంటి చిత్రాలు తెరకెక్కాయి. అవి కూడా అంతగా అలరించలేక పోయాయి. దాంతో దాదాపు పదకొండు సంవత్సరాలు పాటు ఆయన మెగా ఫోన్ పట్టలేదు. 1982లో శోభన్ బాబు ద్విపాత్రాభినయంతో ప్రతీకారం తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి ఆదరణ చూరగొంది. ఆపై శోభన్ బాబుతోనే రామినీడు తెరకెక్కించిన రాజ్ కుమార్ అంతగా అలరించలేకపోయింది. భానుచందర్ హీరోగా రామినీడు తెరకెక్కించిన యజ్ఞం అవార్డులతో పాటు, రివార్డులూ సొంతం చేసుకుంది. ఇదే రామినీడు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం. కాళీపట్నం రామారావు రాసిన యజ్ఞం నవల ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. సన్నకారు రైతుల జీవనాన్ని ఈ కథ కళ్లకు కట్టినట్టు చెప్పింది. ఈ చిత్రంలో రైతుగా నటించిన నటుడు పి.ఎల్.నారాయణకు ఉత్తమ సహాయనటునిగా జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది కూడా దక్కింది. ఆ తరువాత మారిన కాలపరిస్థితులతో సాగలేక రామినీడు సినిమాలకు దూరంగా జరిగారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాదుకు రావడంలో రామినీడు కీలకమైన పాత్ర పోషించారు. భాగ్యనగరంలో చల్లపల్లి రాజా వారు నిర్మించిన సారథి స్టూడియో అభివృద్ధిలో పాలుపంచుకోవడమే కాకుండా తాను దర్శకత్వం వహించిన చిత్రాలను ఆ స్టూడియోలో షూట్ చేస్తూ పరిశ్రమను హైదరాబాదుకు తరలించేందుకు పునాదులు వేశారు. ఏయన్నార్ గారిని హైదరాబాదులో స్థిరపడేలా ఒప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడే దాక రామినీడు కృషి చేస్తూ వచ్చారు. 2009 ఏప్రిల్ 29న అనారోగ్యంతో రామినీడు కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







