బందరు ఉప్పెన, 30వేల మంది జలసమాదైన రోజు
- November 01, 2024
•160 ఏళ్ల క్రితం మచిలీపట్నం ఉప్పెన
•అర్ధరాత్రి, భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఐక్యమైపోయిన 30వేల మంది ప్రజలు
•1864 నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి బందరులో విరుచుకుపడిన భయంకర ఉప్పెన
•13 అడుగుల ఎత్తున ఎగసిపడే కెరటాలు, 780 చదరపు మైళ్ళ పరిధిలో వినాశనం.
•చాలా మందికి తెలియని బందరు ఘోర దుర్ఘటన గురించి చెప్తే చరిత్ర రాస్తే గ్రంథం.
సరిగ్గా 160 ఏళ్ళ క్రితం రక్తాక్షి నామ సంవత్సరం 1864 నవంబర్ ఒకటో తేదీన అంటే ఇదే రోజున మచిలీపట్నంలో ఉన్న నాటి 65 వేల జనాభాలో 30 వేలమంది జలసమాధి అయ్యారు. ఆనాటి బందరులో జరిగిన ఇంత పెద్ద ఘోర దుర్ఘటన గురించి ఇప్పటికీ చాలా మందికి ఇప్పటికీ తెలియదు అంటే ఆశ్చర్యము కలుగక మానదు. ఈ బందరు ఉప్పెనపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఆరోజు ఏం జరిగింది? ఆ ఉపద్రవం ఎలా సంభవించింది? ఆ విపత్తు మిగిల్చిన చేదు జ్ఞాపకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఉప్పెన మిగిల్చిన చేదు జ్ఞాపకాలు:
నవంబర్ 1, 1864: బందరు ఓడరేవు. బ్రిటిష్ పాలనలో ఉన్న ఈ పట్టణం, దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన ఓడరేవుగా ఉండేది. బైబిల్ పరంగా నవంబర్ ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే అంటే సకల పునీతుల దినోత్సవం, నవంబర్ 2 వ తేదీ ఆల్ సోల్స్ డే అంటే సకల ఆత్మల దినోత్సవం. విధి రాసిన విధిరాతో తెలియదు, కాలం రాసిన కడగండ్లో తెలియదు, యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో తమెకేమీ జరుగుతుందో కూడా తెలియని స్థితిలో.. అర్ధరాత్రి భీకర సముద్ర ఘోషలో 30 వేల ప్రాణాలు మౌనంగా ఐక్యమైపోయాయి.
13 అడుగుల ఎత్తున ఎగసిపడిన కెరటాలు 780 చదరపు మైళ్ళ పరిధిలో బందరు తీర ప్రాంతంపై కరాళ నృత్యం చేసిన ఉప్పెన తీవ్రతకు ఆనాటి రెవిన్యూ రికార్డుల ప్రకారం 65 వేల మంది జనాభా ఉన్న పంచాయతీలో కడలి ప్రకోపానికి రాత్రికి రాత్రి 30 వేల మంది జల సమాధి అయ్యారు.
చరిత్రలో తొలిసారి చెలియాలి కట్ట దాటిన సముద్రం తీరాన్ని దాటి 17 మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళపై ఒక్కసారిగా విరుచుకుబడింది. భారీ కెరటాలు జనావాసాలపై చొచ్చుకొచ్చి పిల్లాపాపలను నిర్దాక్షిణ్యంగా తనలో కలిపేసుకుంది.
ఉప్పెన మిగిల్చిన విషాదానికి 700 మంది ప్రజలు నివసిస్తున్న కాలేఖాన్ పేట ప్రాంతంలోని అగ్రహారంలో రాకాసి సముద్రపు అలలకు 630 మంది కొట్టుకుపోయి కేవలం 70 మంది మాత్రమే అక్కడ మిగిలారని ఆనాడు బ్రిటిష్ వారు నమోదు చేసిన రికార్డులలో లిఖితమైంది.
ఉప్పెన ప్రభావం: ఉప్పెన కారణంగా బందరు సముద్ర తీరంలో భారీ ఇసుకమేటలు ఏర్పడ్డాయి. దీంతో ఓడలు వచ్చేందుకు తీరం వద్ద సరైన లోతు లేనందున భారీ ఓడల రాకపోకలకు మహా కష్టమైంది. ఉప్పెన మిగిల్చిన విషాదానికి తోడు అక్కడ ఏర్పడ్డ ఇసుక మేటలు బందరు పోర్టుకి శాపంగా మారాయి. పోర్టు నిర్మాణం సాగాలంటే నిరంతరం ఇసుకను తవ్వుతూ నిరంతర డ్రెడ్జింగ్ చేయాల్సిందేనని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు.
కడలి ప్రకోనికి బలై కనీసం ఖనన కార్యక్రమానికి కూడా నోచుకోని కుళ్లిపోయిన శవాలను పీక్కుతినేందుకు వేలదిగా రాబందుల గుంపులు ఆకాశం నుంచి కిందకు వాలిన భీకర దృశ్యాలు చూసి ఎందరో మానసికంగా చలించిపోయారు. ..
ప్రజల బాధలు: సముద్రపు నీరు ప్రవహించిన కారణంగా వ్యవసాయ భూములు చౌడుబారి పోయాయి. నూతులలో తీయని నీరు సైతం ఉప్పునీరుగా మారిపోయింది. నాడు ప్రజలకు తాగునీరు దొరకడం ఎంతో కష్టమైంది. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయి, అనేక మంది నిరాశ్రయులయ్యారు. బ్రిటిష్ జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాధ శవాలను ఖననం చేసి, ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించారు.
చరిత్రలో నిలిచిన సంఘటనలు: ఆనాటి పరాయి పాలకుడైన ఒక బ్రిటిష్ అధికారి ఆ ఉప్పెనలో మృతి చెందిన తన కుటుంబ సభ్యులతో పాటు అదే రోజు రాత్రి కాలగర్భంలో కన్నుమూసిన 30 వేల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థించి బందరుకోట రోమన్ కాథలిక్ మిషన్ సెమెట్రీ ( ఖనన స్థలం)లో ఒక భారీ స్థూపం నిర్మించారు. ఇంకా ఆ దుర్ఘటన న వివరిస్తూ ఒక శిలాఫలకం ఆ స్థూపంలో ఏర్పాటు చేశారు.
ఇప్పటికీ ఆ నిర్మాణ శాసనం నాటి ప్రకృతి ప్రకోపాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఇంకా మాచవరం సమీపంలోనీ నేటి డి మార్ట్ పక్కన ఉన్న 1809 సంవత్సరం నిర్మించిన సెయింట్ మేరీస్ చర్చి ఆ ఉప్పెన విలయతాండవానికి ప్రత్యక్ష సాక్ష్యం. 10 అడుగుల మేర చర్చి గోడలను తాకుతూ ప్రవహించిన ఆ సముద్రపు నీరు ఉప్పునీటి చారిక ఇంకా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని సున్నంతో ఎంత పులిమినప్పటికీ ఇప్పటికి ఆ చార స్పష్టంగా కనబడుతూనే ఉంటుందని, సున్నం కలవనీయదని అక్కడి స్థానికులు చెప్పుకుంటూ ఆనాటి ప్రళయాన్ని గుర్తు చేసుకుంటారు.
ఇంకా చింతగుంటపాలెంలో నివసిస్తున్న పురుషోత్త సోమయాజి శర్మ అనే అతనిని సముద్ర ప్రవాహం ఆయనను ఒక తాటిచెట్టు మొవ్వలో కూర్చోబెట్టాయి. అక్కడ చిక్కుకున్న ఆయన తర్వాత రోజున అతి కష్టం మీద తాటి చెట్టు కి తన స్వస్థలానికి చేరుకున్నాడని నాటి ప్రజలు కథలుగా చెప్పుకొనేవారు.
అలాగే నాటి బందరులో నేటి కోటావారితుళ్ళా సెంటర్ పాత దుర్గామహల్ ప్రస్తుత యాక్సెస్ బ్యాంకు వద్ద శ్రీ కాండ్రేకుల జోగి జగన్నాధ పంతులు గారి మేడ డిసెంబర్ 26 వ తేదీ 1988 వరకు ఆ పురాతన భవనం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా ఉండేది. ఆ పంతులు గారి మేడలో ఉప్పెన రాత్రి వందమందికి పైగా ప్రజలు తలదాచుకొని తమ ప్రాణాలను రక్షించుకొన్నారని 13 అడుగుల ఎత్తున సముద్రపు నీళ్లు ఈ మేడ పక్కనుంచి వెళ్లయని నాటి ప్రత్యక్ష సాక్షులు తమ తరానికి ఇప్పటికీ చెప్పుకుంటారు.
శవాల గుట్టలు - రాబందుల గుంపులు:
ఆ ఉప్పెన అనంతరం నాటి బ్రిటిష్ జిల్లా కలెక్టర్ థారన్ హిల్ ఉప్పెన అనంతరం చేసిన సేవలు ఎంతో చిరస్మరణీయం. ఆయన ఆధ్వర్యంలో ఆంగ్లేయ అధికారులు తమ పొలిసు సిబ్బందితో కలసి కొన్ని బృందాలుగా ఏర్పడి పట్టణమంతా ఉన్న అనేక అనాధ శవాల గుట్టల ను ..పశువుల కళేబరాలను ఎక్కడికక్కడే భూమిలో పూడ్చిపెట్టారు..ఎడ్మండ్ షార్కి దంపతులు తమ ఉన్నత బాలికల పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు వసతి గృహంలో ఉండి సముద్రంలో మునిగి చనిపోగా.. వారినందరిని ఆ సమీప ప్రాంతంలో ఖననం చేశారు.( ప్రస్తుతం ఇది నోబుల్ కాలనీలో నోబుల్ షార్కి మున్సిపల్ పార్క్ గా కొనసాగుతుంది ) 45 ఏళ్ల క్రితం వరకు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి గుట్టలు కనబడేవి.. మృత కళేబరాలు పాతిపెట్టిన విషయం తెలియని చాలా మంది గుట్టలుగా ఉన్న ఆ మట్టిని తమ ఇళ్ళను మెరకు చేసుకునేందుకు ఎడ్ల బండ్లలలో ట్రాక్టర్లలో తరలించి ఇక్కడ ఒక పెద్ద గుంట గా మార్చారు.. కొందరు ఆ మట్టిని తవ్వే టప్పుడు తమకు మానవ కళేబరం తాలూకా కొన్ని ఎముకలు కూడా దొరికాయని అక్కడి స్థానికులు చెబుతుంటారు
ఉప్పెనతో మారిన కొందరి తలరాతలు:
ఆనాటి ఉప్పెనలో వేలాదిమంది జలసమాధి కాగా అంతటి ఘోర విషాదంలోనూ కొందరు స్వార్ధపరులు ధనమే పరమావధిగా పైకం కోసం ధన పిశాచాలుగా మారారు. సముద్రం నీటిలో ఊపిరాడక అర్థంతరంగా చనిపోయిన మృతుల శరీరాలపై బంగారు ఆభరణాలు సేకరించే పనిలో అంతటి బీకర వాతావరణంలోనూ నిమగ్నమైయ్యారంట . వీరు శవాలపై బంగారం సేకరించి వాటిని కరిగించి బంగారు ఇటుకలుగా మార్చి రహస్యంగా తమ ఇంటి గోడల్లో దాచుకున్నరని ఆ తర్వాత వారే మచిలీపట్టణంలో అత్యంత ధనవంతులుగా రూపాంతరం చెందారని అప్పట్లో వృద్ధతరం వారు తమ పిల్లలకు కథలు కథలుగా చెప్పుకొన్నారు.
నేటి పరిస్థితి: ఆనాటి విషాదం అత్యధికులకు నేటికీ తెలియదు. ఈ ఉప్పెన అనంతరం, మచిలీపట్నం అభివృద్ధి కుంటుపడింది. ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. బ్రిటిష్ పాలకులు తమ స్థావరాలను మద్రాస్కు మార్చుకున్నారు. ఈ ఘోర దుర్ఘటన గురించి చాలా మందికి తెలియదు. బందరు ఉప్పెనపై అవగాహన కల్పించడం అవసరం.
కడలి ఒడిలో కన్ను మూసిన ఆనాటి మృతులను గుర్తు చేసుకుంటూ కనీసం పట్టుమని పదిమందైన ఆ ప్రాంతానికి వెళ్లి కనీసం ఒక్కరికైన నివాళి ప్రకటించడమో లేక పుష్పగుచ్ఛమైన ఆ స్తూపం ముందు ఉంచకపోవడం భాదాకరం. బందరు ఉప్పెన పై అవగాహన ఉన్న ఏ ఒక్కరు ఎంతో విషాదకరమైన చరిత్ర గల ఈ రోజున గుర్తు చేసుకోకపోవడం విచారకరం.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల