భారత రాజ్యాంగం@75

- November 26, 2024 , by Maagulf
భారత రాజ్యాంగం@75

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను.. ప్రపంచంలో ప్రత్యేకంగా నిలపడానికి ప్రధానకారణం రాజ్యాంగమే. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం దేశాన్ని  సమైక్యంగా ఉంచుతోందనడంలో సందేహం లేదు. అలాగే అందరికీ సమానవకాశాలు కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో వర్గాలు పైకి రావడానికి కారణం అవుతోంది.

స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకున్న కొత్తలో దేశంలోఎన్నో వాదాలు ఉన్నాయి. ఎవరి వాదన వారిది, ఎన్నో భాషలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యమా అనుకున్నారు. కానీ రాజ్యాంగం అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది. అదే సమయంలో అప్పటికి దేశంలో కొన్ని వర్గాలు వృద్ధి చెందితే..కులాలు, మతాల వారీగా కొన్ని వర్గాలు దారుణ పరిస్థితుల్లో వివక్షను ఎదుర్కొంటూ వస్తున్నారు. వారికి సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇది కూడా ఆయా వర్గాలు పైకి రావడానికి ఉపయోగపడ్డాయి.

స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అనుకున్నంతగా వృద్ధి చెందకపోవచ్చు.  ప్రజాస్వామ్యం లేని నియంతల పాలన ఉండే చైనాతో అభివృద్ధిలో పోటీ పడకపోవచ్చు. కానీ ప్రజలకు స్వేచ్చా స్వాతంత్రాలు ఇవ్వడంతో చైనా కన్నా ఎంతో ముందున్నాం. దానికి రాజ్యాంగమే దారి చూపింది. ఎలా చూసినా.. భారత రాజ్యాంగం అత్యంత పవర్ ఫుల్. దేశాన్ని .. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ప్రజలు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం https: //constitution75.com పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో రాజ్యాంగ పరిషత్‌ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది. నేటి నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దానికి సంబంధించిన వీడియోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ధ్రువపత్రాలు పొందొచ్చని వివరించింది. 

  - డి.వి.అరవింద్    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com