రాజకీయ ఘనాపాటి-రోశయ్య

- December 04, 2024 , by Maagulf
రాజకీయ ఘనాపాటి-రోశయ్య

నిండైన రూపం, తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యం, మాటల్లో మాధుర్యం, చేతల్లో చాణక్యం, ఇలా అన్నీ కలగలిపిన వ్యక్తే కొణిజేటి రోశయ్య. పల్లె నుంచి దిల్లీ స్థాయికి ఎదిగినా ఎప్పుడూ మూలాలు మరువలేదు.అందరికీ తలలో నాలుకలా వ్యవహరించే స్వభావం గలవారు.తనదైన వాగ్ధాటితో ప్రతిపక్షం దూకుడుకు కళ్లెం వేయగలిగేవారు. నేడు రాజకీయ ఘనాపాటి, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 3వ వర్థంతి.

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరులో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కొణిజేటి సుబ్బయ్య, ఆదిమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం విషయానికొస్తే ఒకటి నుంచి అయిదో తరగతి వరకు వేమూరులో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పెరవలిలో, తొమ్మిది, పది తరగతులను కొల్లూరులో పూర్తిచేశారు. పెరవలిలో చదువుకునేటప్పుడు బస్సు సౌకర్యం లేక కాలినడకన డొంకలు, కాల్వగట్లపై నడిచి వెళ్లేవారు. ఆ తర్వాత గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరులో చదువుతున్న రోజుల్లోనే ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. దీనివల్ల అప్పుడప్పుడు క్లాసులకు డుమ్మా కొట్టినా... చదువులో ఎప్పుడూ వెనుకబడేవారు కాదు. హిందూ కాలేజీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో అప్పట్లోనే పక్కాగా వ్యవహరించేవారు. అప్పట్లో శ్రీనగర్‌లో జరిగిన జాతీయ విద్యార్థి సదస్సుకు రోశయ్య నేతృత్వంలో బృందం వెళ్లింది. అక్కడి నుంచి రోశయ్య, ఇతర విద్యార్థులు దిల్లీ వెళ్లి తీన్‌మూర్తి భవన్‌లో ప్రధాని నెహ్రూని కలిశారు. రాజకీయాల్నే కెరీర్‌గా ఎంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య ఎన్‌.జి.రంగా శిష్యరికం రోశయ్య ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా ఎదిగేందుకు తోడ్పడింది. ఆయన నిడుబ్రోలులో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. రంగా, గౌతు లచ్చన్నల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేవారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌కి విముక్తి లభించాక... విశాలాంధ్ర ఏర్పాటు లక్ష్యంగా చర్చలకు అక్కడి నాయకులు వి.బి.రాజు, కొత్తూరి సీతయ్య గుప్త, బూర్గుల రామకృష్ణారావు తదితరులు గుంటూరుకి వచ్చినప్పుడు వారి ఆతిథ్యానికి ఏర్పాట్లు చేయడంలో రోశయ్య క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్జీ రంగా గారితో కలిసి స్వతంత్ర పార్టీలో చురుగ్గా పనిచేశారు.

 1964లో వేమూరు పంచాయతీ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన రోశయ్యను రాజకీయంగా ప్రోత్సహించేందుకు సంకల్పించిన ఆచార్య రంగా, 1968లో స్వతంత్ర పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి పంపించారు. 1972 నాటికి ఆచార్య రంగా, పాటూరి రాజగోపాల నాయుడు, యడ్లపాటి వెంకట్రావు గార్లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తరపున 1974, 1980లలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1978-80మధ్యలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాలు & రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. 1980-82 వరకు అంజయ్య మంత్రివర్గంలో రవాణా, గృహ నిర్మాణం శాఖల మంత్రిగా, 1982-83 దాక కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో హోం శాఖ మంత్రిగా పనిచేశారు.

1983లో తెదేపా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తరపున శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికై, ప్రభుత్వ విధానాలను తూర్పార బట్టారు. ఆయన దాటికి తట్టుకోలేక నాటి తెదేపా మంత్రులు సైతం బిక్క మొహం వేసేవారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. 1984లో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ పదవుల్లో కొనసాగారు. 1989-94 వరకు చెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి, విజయభాస్కర రెడ్డి మంత్రివర్గాల్లో ఆర్థిక, రవాణా, విద్యుత్తు, ఆరోగ్య, విద్య శాఖల మంత్రిగా పనిచేశారు.1995-97: ఏపీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన రోశయ్య 1998లో నరసరావుపేట నుంచి లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

చెన్నారెడ్డి, రోశయ్య అత్యంత సన్నిహితంగా, ఆత్మబంధువుల్లా మెలిగేవారు. చెన్నారెడ్డి అంటే రోశయ్య అత్యంత గౌరవం చూపించేవారు. 1989లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న చెన్నారెడ్డి... అప్పటి ఎన్నికల్లో రోశయ్య ఇంటి నుంచే తన రాజకీయ వ్యూహాల్ని, ప్రచార ప్రణాళికల్ని అమలు చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... రోశయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన ఆర్థిక, రవాణా, విద్యుత్‌ శాఖల్ని అప్పగించారు. చెన్నారెడ్డిపై తనకున్న గౌరవాన్ని, కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడూ దాచుకునేవారు కూడా కాదు.

రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి. వైఎస్ఆర్‌ 1999లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు శాసనసభలో వీరిరువురూ ప్రధాన పక్షాన్ని ఇరుకున పెట్టే వారు. 2004లో వైఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన రోశయ్య… వైఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు చేపట్టి శాసనసభలో నెంబర్ 2గా వ్యవహరించారు. 2009లో రోశయ్య తాను ఇక శాసన సభకు పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పిన మరుక్షణం రోశయ్య చేత మంత్రి పదవికి శాసనసభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాధించాక రోశయ్యను వైఎస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు.

వైఎస్‌ మరణానతరం అధిష్టానం ఆదేశాలమేరకు అనూహ్యమైన పరిణామాలతో ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులైనా అనేక ఇబ్బందుల మధ్యనే ఆ పదవిలో కొనసాగారు. చివరికి అధిష్టానం ముఖమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడంతో 2011 ఆగస్టు 31న తమిళ నాడు గవర్నర్ గా వెళ్ళారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలై నరెంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను అనేక చోట్ల తొలగించి వేరే వారిని నియమిస్తే తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ వ్యక్తి అయిన రోశయ్యను మాత్రం తొలగించకుండా కొనసాగించారు. దీనికి ప్రధాన కారణం వివాద రహితంగా తమిళనాడులో పేరు తెచ్చుకోవడమే. 2016లో తమిళనాడు గవర్నర్ గా పదవి విరమణ చేశారు.

ముఖ్యమంత్రిగా ఎవరున్నా... వారికి విధేయంగా ఉంటూ, వారితో సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే తప్ప, వారు రాజకీయంగా తనకంటే సీనియర్లా, జూనియర్లా అన్న భేషజాలకు ఆయనెప్పుడూ పోలేదు. అందరికీ సలహాలిస్తూ, తలలో నాలుకలా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. క్లిష్టమైన సమస్య ఏది వచ్చినా... రోశయ్యకు అప్పగిస్తే సులువుగా పరిష్కరిస్తారన్న భరోసా ముఖ్యమంత్రుల్లో ఉండేది. ఆయన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి కూడా అంతే ఆప్తుడిగా ఉండేవారు. ఒక దశలో 65 కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరించేవారు. వయోభారాన్ని లెక్క చేయకుండా, తనకు అప్పగించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించేవారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం..అనేక మంది సీఎంల దగ్గర వివిధ శాఖల మంత్రులుగా పనిచేసిన రోశయ్య వివిధ అంశాలపై ముఖ్యమంత్రులు వేసిన కమిటీలు, సబ్‌కమిటీల్లో సైతం కీలక బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ అంశంపై కమిటీ వేశారు. దీనికి రోశయ్యను ఛైర్మన్‌గా నియమించారు. తన రాజకీయ చాతుర్యంతో ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన తన పనితీరుతో స్వపక్షంలో మార్కులు పొందేవారు.

ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు రోశయ్య. 2009-10 బడ్జెట్‌తో కలిపి మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. దాంట్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు ప్ర‌వేశ‌పెట్ట‌గా.. ఒక‌సారి సీఎంగా ఆయ‌న బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ రికార్డును నెల‌కొల్పిన నేత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎవ‌రూ లేరు. బడ్జెట్‌ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందరు.

ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్పప్పటికీ... పాలనా వ్యవహారాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించేలా చూడటంతో రోశయ్య దిట్ట. సంక్షేమ పథకాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్నీ సమన్వయం చేసుకోవడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే. సంక్షేమానికి పెద్ద పీట వేయకపోతే రాజకీయంగా పార్టీకి ఇబ్బంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే రాష్ట్రం వెనకబడుతుంది. ఆ రెండింటినీ సమతూకం చేస్తూ... ప్రభుత్వ ప్రాధాన్యాలు అమలయ్యేలా చేయడంలో రోశయ్య అనుభవం, లౌక్యం ఎంతగానే ఉపయోగపడేవి.

అందుకే ముఖ్యమంత్రి ఎవరైనా... ఆర్థిక మంత్రి పదవి రోశయ్యనే వరించేది. అలాగని విషయాన్ని గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు రోశయ్య వెనక్కు తగ్గేవారు కాదని ఆయన సహచరులు, కలసి పనిచేసిన అధికారులు చెబుతారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో సంక్షేమం పాలు ఎక్కువైందనిపించినప్పుడు... అది మరీ మితిమీరితే వచ్చే ఇబ్బందుల గురించి సుతిమెత్తగానే హెచ్చరించారని ఒక అధికారి తెలిపారు. రేషన్‌ దుకాణాల్లో సరఫరా చేసే సబ్సిడీ బియ్యం ధర తగ్గించాలని వైఎస్‌ నిర్ణయం తీసుకున్నప్పుడూ...ముందే తనను సంప్రదించి ఉండాల్సిందని ఆయన తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగానే చెప్పారని అప్పట్లో ఆయనతో పనిచేసిన మరో అధికారి పేర్కొన్నారు.

రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టాక మరుసటి నెలలోనే కృష్ణానదికి కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల వరదనీరు పోటెత్తింది. ప్రవాహవేగానికి డ్యామ్‌ కొట్టుకుపోతుందేమోనని భయపడ్డారు. వేలాది గ్రామాలు జలమయమయ్యాయి. ప్రాణనష్టం, అపారంగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ విపత్కర పరిస్థితుల్లో రోశయ్య అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. వరద పోటెత్తిన రోజు ఆయన రాత్రంతా సచివాలయంలోనే ఉండి... పరిస్థితిని సమీక్షించారు. ఆ వయసులోనూ ఆయన ముఖ్యమంత్రిగా అన్ని శాఖల మంత్రులు, అధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. క్షేత్ర స్థాయి పర్యటనలతో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేవారు.

రోశయ్య ఆజానుబాహుడు... స్పష్టమైన ఉచ్చారణ... మనిషి ఎంత గంభీరమో... మనసు అంత సున్నితం. ఆయన ఎప్పుడూ తెల్ల పంచె, లాల్చీ ధరించి అచ్చతెలుగు ఆహార్యంతో... తెలుగుదనానికి చిహ్నంగా ఉండేవారు. లోక్‌సభలోనూ తెలుగులో మాట్లాడేవారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... సభలో ఆయన మాట్లాడుతుంటే విపక్ష పార్టీ సభ్యులూ శ్రద్ధగా వినేవారు. తనదైౖన శైలిలో చెణుకులతో, పిట్టకథలతో ప్రత్యర్థుల మాటల దాడిని తిప్పికొట్టేవారు. సభలో గంభీర వాతావరణం నెలకొన్నప్పుడూ ఆయన తనదైన శైలిలో చెణుకులతో వాతావరణాన్ని తేలిక పరిచేవారు.

మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఏ పదవిలో ఉన్నా... రోశయ్య నిరాడంబరంగానే ఉండేవారు. అందరితో సన్నిహితంగా మెలిగేవారు. ఎవరైనా తనను విమర్శించినా, తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా మనసులో పెట్టుకునేవారు కాదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి అప్పట్లో ఒక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాక... నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి సీనియర్‌ మంత్రిగా రోశయ్య సారథ్యం వహించారు. వై.ఎస్‌. మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించేందుకు ఆ సమావేశం జరిగింది. జగన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేయాలని నేను సూచించాను అప్పటి సీఎస్‌ కొంత వారించారు. నేను అలాంటి ప్రతిపాదన చేయడం ఆయనకు కొంత ఇబ్బందికరమే. కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాకా ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా, నాపై ఆదరాభిమానాలు చూపించారు’’ అని పేర్కొన్నారు.తన విలక్షణమైన వ్యవహార శైలి, హుందాతనంతో ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రులు మారేవారేమోగానీ... మంత్రివర్గంలో రోశయ్య స్థానం మాత్రం పదిలం. ఆయనకు కీలక స్థానం దక్కడానికి అందరికీ తలలో నాలుకలా వ్యవహరించే స్వభావమే కారణం. లౌక్యం, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం ఆయన ఆయుధాలు. బహుముఖప్రజ్ఞ, కార్యదక్షత, పార్టీ పట్ల అంకితభావం, విధేయత ఆయన బలాలు. ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంపై పదునైన వాగ్బాణాలు సంధించగలరు... అధికారపక్షంలో ఉన్నప్పుడూ తన వాగ్ధాటితో ప్రతిపక్షం దూకుడుకు కళ్లెమూ వేయగలరు. అందువల్లే ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చినా, అంగ బలం, వర్గబలం లేకపోయినా ఉన్నత పదవులు పొందగలిగారు.

గుంటూరు వంటి రాజకీయ చైతన్యంగల జిల్లా నుంచి విద్యార్థి నాయకుడిగా, ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకుని... అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పదవులు అధిరోహించారు.కాంగ్రెస్‌ పార్టీలో ఈతరం నాయకులంతా ‘పెద్దాయన’గా పిలుచుకునే కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నిరుపమానం. అనారోగ్యం కారణంగా 2021 డిసెంబరు 4 తేదీన తన 88వ ఏట కన్నుమూశారు.  

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com