స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

- January 12, 2025 , by Maagulf
స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్: మన మూలాలను మరచిపోకూడదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు.మన మూలాల్లో గొప్ప సంస్కృతి ఉందని, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ అజీజ్ నగర్ వద్ద ఉన్న ‘ద వెన్యూ ఫంక్షన్ హాల్’ లో స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కన్నతల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని మరవకూడదు. మనం తెలుగువారం. తెలుగులోనే  మాట్లాడుకుందాం.ఇంగ్లిష్ భాష నేర్చుకోవచ్చు, ఆ భాషలో మాట్లాడవచ్చు.కానీ ఇంగ్లిష్ వారిలా మారవద్దు. వారి సంస్కృతికి బానిసలు కావద్దు.’’ అని స్పష్టం చేశారు. పండగలు సమైక్యతా భావాన్ని బోధిస్తాయని వెంకయ్యనాయుడు చెప్పారు. సంక్రాంతి పండగ అంటే ప్రకృతిని పూజించే, ప్రృకృతిని ఆరాధించే, ప్రకృతిని ప్రేమించే పండగ అని అన్నారు. ‘‘చీమలకు చక్కెర పెట్టి, పశువులకు దండం పెట్టే సంస్కృతి మనది. ఆ సంస్కృతిని మరవద్దు.’’ అని సూచించారు.సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి అని, సూర్యుడే మన జీవితానికి వెలుగు అని  వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘ఉదయం తలుపు తీయగానే సూర్యుడి కిరణాలతో ఇంట్లోకి వెలుగు వస్తుంది. అలాగే సూర్యుడితో మన జీవనం మమేకమయితే మన జీవితంలోకి వెలుగులు వస్తాయి.పిల్లలందరూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యరశ్మి వంటికి తగలాలి.’’ అని చెప్పారు. అందరూ సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అప్పుడు అంతా మంచే జరుగుతుందని అన్నారు. 

‘‘సంక్రాంతి సందర్భంగా మన ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను చేరవేసేందుకు, మన పెద్దల వైభవాన్ని తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ 10 అంశాల మీద దృష్టి పెట్టాలన్నది నా ఆకాంక్ష.

1. మన మూలాలకు తరలి వెళదాం. భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి కృషి చేద్దాం. సేవా కార్యక్రమాల్లో పాల్గొందాం.
2. పాశ్చాత్య జీవనాన్ని అనుకరించటం మానుకుని, భారతీయులుగా జీవనం సాగిద్దాం.
3. ఆరోగ్యాన్ని కాపాడే మన సంప్రదాయ ఆహారమే తీసుకుందాం. 
4. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత పెంచి, రసాయనాల వాడకాన్ని విడనాడుదాం. 
5. మన భారతీయ మాతృభాషలను గౌరవించి, ప్రోత్సహించి, మాతృభాషా పరిరక్షణకై ఉద్యమిద్దాం.
6. మన సంపన్నమైన సామాజిక వ్యవస్థను సమగ్ర రూపానికి తీసుకువచ్చిన కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం.
7. సంపదను పెంచుకుంటూ అందులో కాస్త ఇతరులతో పంచుకుందాం. 
8. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతితో కలిసి జీవిద్దాం. వ్యాయామం చేద్దాం.
9. మన ఆట, మన పాట, మన బాట, మన మాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు మరచిపోకుండా  కాపాడుకుందాం.
10.మనము మన బాధ్యతలను, కర్తవ్యాలను, పనులను నిర్వర్తించి దేశ భవిష్యత్తుకు సహకరిద్దాం. ’’ అని సూచించారు. 

అంతకు ముందు తెలుగుదనం ఉట్టిపడేలా, పల్లె వాతావరణం కళ్లకు కట్టేలా ద వెన్యూ  ఫంక్షన్ హాల్ లో  ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను వెంకయ్యనాయుడు తన సతీమణి ఉషమ్మగారు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. హరిదాసు సంకీర్తనలు, భోగిమంటలు, గాలిపటాలతో ఆవరణ కళకళలాడింది.వెంకయ్యనాయుడు దంపతులు ఎంతో ఉత్సాహంతో గాలిపటాలను ఎగరవేశారు. పాతకాలపు మంచాల పై కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని తాము పల్లెలో గడిపిన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఎడ్లబండి, రోళ్లు, రోకళ్లు, తిరగలి తదితర ఉపకరణాల ప్రదర్శన ఆకట్టుకుంది. పల్లె సంస్కృతిని గుర్తు చేస్తూ చక్కటి ఏర్పాట్లు చేశారని ద వెన్యూ ఫంక్షన్ హాల్ యజమాని శ్తుమ్మల సంపత్ ను అభినందించారు. 

ఈ సందర్భంగా సంక్రాంతి ప్రాశస్త్యాన్ని ఆధ్యాత్మిక, లౌకిక కోణంలో శతావధాని  ఆముదాల మురళి వివరించారు. తెలుగు జానపద వైభవాన్ని, సంక్రాంతి వైభవాన్ని కళ్ళకు కట్టేలా తమ గానము, జానపద  నృత్య ప్రదర్శనతో డాక్టర్ లింగా శ్రీనివాస్ బృందం అలరించింది. తెలుగు పద్యగానంతో చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ అలరించాడు. స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్  వందన సమర్పణ చేశారు.  అంతకుముందు తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి , మరికొందరు రచనలతో రైతునేస్తం వారు ప్రచురించిన ‘వండని వంటలు’, రఘోత్తమరెడ్డి ‘మిద్దెతోట ’ పుస్తకానికి హిందీ అనువాదమైన ‘బాగ్ వని’ పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.సంక్రాంతి సంబరాల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, అనకాపల్లి ఎంపీ  సి.ఎం.రమేశ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు  కామినేని శ్రీనివాస్, వై.ఎస్.చౌదరి, డీఆర్డీవో పూర్వఛైర్మన్ సతీశ్ రెడ్డి, ప్రముఖ చలనచిత్ర నటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com