త్వరలో ఏపీలో కొత్త చట్టం: సీఎం చంద్రబాబు

- January 17, 2025 , by Maagulf
త్వరలో ఏపీలో కొత్త చట్టం: సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హతలను మార్చుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే అర్హత కల్పించేలా కొత్త చట్టం తీసుకువస్తామని తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం ఎంత పరిమాణం ఉంటుంది అనేది ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. జనాభా ఒకప్పుడు భారం అని.. కానీ ఇప్పుడు అది ఆస్తి అని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశాలు ఉన్నాయని.. అయితే ఇది చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో జనాభా పెంచేందుకు.. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హతకు సంబంధించిన చట్టం తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంతకుముందు జనాభాను నియంత్రించాలని ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే గరిష్ఠంగా 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని.. అంతకంటే ఎక్కువ ఉన్నా.. 25 కిలోలకు మించి ఇచ్చేవాళ్లం కాదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే అనర్హులుగా గుర్తిస్తూ చట్టం తెచ్చామని గుర్తు చేశారు.

అయితే అదంతా అప్పటి పరిస్థితి అని.. కానీ ఇప్పుడు జనాభా పెంచాలని. అందుకే ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జనా భా 2026లో 5.38 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు.. 2031 వరకు ఆ సంఖ్య 5.42 కోట్లకు పెరుగుతుందని.. ఆ తర్వాత 2036లో 5.44 కోట్లకు చేరుతుందని చెప్పారు. అయితే 2041లో మాత్రం ఏపీ జనాభా 5.42 కోట్లకు తగ్గిపోయి.. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని చంద్రబాబు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com