డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..

- January 18, 2025 , by Maagulf
డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..

సింగపూర్: ముఖ్యమంత్రి రేవంత్ సారధ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన సందర్భంగా మరో కీలకమైన ఒప్పందం చేసుకుంది.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ‘ఎస్‌టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా’ ముందుకు వచ్చింది. ముచ్చర్ల–మీర్ఖాన్‌పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్‌ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్‌ను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్‌టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ అవగాహన ఒప్పందంపై సీఎం రేవంత్ స్పందిస్తూ త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.

కాగా, ఈ కంపెనీ హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 100 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచే నిబంధన ఇందులో ఉంది. దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తోంది.

ఎస్‌టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్ మాట్లాడుతూ.. తెలంగాణతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నామని… ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, సుస్థిర డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com