అంతర్జాతీయ విద్యాదినోత్సవం...!

- January 24, 2025 , by Maagulf
అంతర్జాతీయ విద్యాదినోత్సవం...!

‘’విద్య లేనివాడు వింత పశువు” అనే పాత తెలుగు సామెత వినటానికి కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ, మనిషికి విద్య ఎంత ముఖ్యమో మొట్టికాయ పెట్టి మరీ చెప్పినట్టు ఉంటుంది. జ్ఞానం అనేది  ఒక శక్తి. అది విద్య నుంచే మొదలవుతుంది.ఇప్పుడు విద్య అనేది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే కాదు ఒక కనీస అవసరం.ఇది వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతికి మూలస్తంభం.ఈ రోజుల్లో సమాజంలో మన గలగలగాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, విద్య అంత కన్నా ముఖ్యం.ఒక మనిషిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలిగే శక్తి విద్యకుంది. అందుకే దీని ప్రాముఖ్యతని, అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  2018లో విద్య దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 24న  ప్రపంచమంతటా అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 

విద్య ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా, సమాజం అభివృద్ధికి కూడా కీలకంగా ఉంటుంది. నిరక్షరాస్యతను తగ్గించడం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాల్లో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మెరుగైన ఆర్థిక అవకాశాలను అందించి ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది. మన దేశ జనాభాలో సంపన్నులకంటే దరిద్రంలో బ్రతికేవారి సంఖ్యే ఎక్కువ కనుక ఆ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే విద్య అనే ఆయుధం చేపట్టాలి. అందుకే ఒక చిన్న కూలిపని చేసుకునే వ్యక్తి కూడా తన కష్టం తమ పిల్లలకి రాకూడదని పిల్లలను చదివించి వారి  భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకుంటున్నారు.  

విద్య  ద్వారానే సమానత్వం సాధ్యమవుతుంది.  అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు కూడా ఎంతో వివక్ష, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యనే ఆయుధంగా మలచుకుని గొప్పవాళ్లయ్యారు. దేశ చరిత్రలోనే నిలిచిపోయారు.. ‘విద్య అనేది పులిపాల వంటిది, దాన్ని తాగినవారు గర్జించకుండా ఉండలేరు” అనేది ఆయన మాట. అలాగే లింగ సమానత్వం, సామాజిక అసమానతలను తగ్గించడం వంటి ఇతర లక్ష్యాలను సాధించడంలో కూడా  విద్య సాయపడుతుంది.

భారతదేశంలోని విద్యా ప్రమాణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందడానికి అనువైన పరిస్థితులు ఉంటాయి.వారికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలలలో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి.దీనికి విరుద్ధంగా  సరిపోని మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన విద్యావేత్తల కొరత, విద్యా వనరులు పరిమితంగా ఉండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందటంలో ఇబ్బందులు పడుతుంటారు. పేదరికం, గ్రామీణ సమాజాలలో తక్కువ అక్షరాస్యత స్థాయిలు వంటి సామాజిక, ఆర్థిక కారణాల వలన కూడా ఈ అసమానతలు మరింత తీవ్రమవుతున్నాయి. 

యునెస్కో లెక్కల ప్రకారం ప్రస్తుతం 250 మిలియన్ల మంది పిల్లలు, యువత విద్యకు దూరంగా ఉన్నారు.  763 మిలియన్ల పెద్దలు నిరక్షరాస్యులు.  ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం కేరళలో అత్యధిక అక్షరాస్యత రేటు 94% నమోదవగా లక్షద్వీప్ 91.85%, మిజోరంలో 91.33% అక్షరాస్యత నమోదు అయింది. బిహార్‌‌లో అత్యల్ప అక్షరాస్యత రేటు 61.8% నమోదు అయింది.  

తత్ఫలితంగా గ్రామీణ భారతదేశంలోని విద్యార్థులు పట్టణ విద్యార్థుల్లాగ నాణ్యమైన విద్యను పొందటంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు విరివిగా కృషి చేస్తున్నాయి. 2024 డిసెంబర్ నెలలో భారత  ప్రభుత్వం తెలియచేసిన  సమాచారం ప్రకారం,  గత దశాబ్దంలో  భారత దేశంలో గ్రామీణ అక్షరాస్యత రేటు 10 శాతం పాయింట్లు పెరిగి గణనీయమైన మెరుగుదలని నమోదు చేసింది. 

భారతదేశం తన విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు ఈ భారీ అంతరాన్ని తగ్గించడానికి  తన కృషిని కొనసాగిస్తోంది. నేడు మెజారిటీ విద్యార్థులకు విద్య  అందుబాటులోకి వచ్చినప్పటికి విద్య నాణ్యతా ప్రమాణాలు బాగా లోపిస్తున్నాయి అని అనేక ప్రముఖ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రైవేటు విద్యాసంస్థలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్,  ఎంబీఏ వంటి కోర్సులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్​డీ వరకు చదువుతున్నవారి సంఖ్య కూడా చాలావరకు పెరిగింది.  విద్యార్థులు  సాధించిన మార్కులు,  సాధించిన డిగ్రీ  చెప్పుకోవడానికి తప్ప విద్యార్థులకు చదివిన కోర్సులపై నాలెడ్జ్ ఉండటం లేదు. అంటే సాధించిన డిగ్రీ పట్టాలు ఒక  ‘కాగితపు పులులు’గా  చలామణి అవడానికి మాత్రమే పని చేస్తున్నాయి. 

ఒక దేశంలో అశాంతి, అస్థిర పరిస్థితులను సృష్టించాలంటే యుద్ధాలు చేయకుండా కేవలం విద్యా విధానాన్ని ధ్వంసం చేస్తే సరిపోతుందని మేధావులు స్పష్టంగా చెప్పారు. ఉదాహరణకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన సోవియట్ యూనియన్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్‌‌ను ఆక్రమించిన సమయంలో (1979– -1989) సోవియట్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్‌లో తప్పనిసరి విద్యను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అక్షరాస్యతను ప్రోత్సహించింది. పురుషులు, మహిళలకు పక్షపాతం లేకుండా  సమానమైన  విద్యావకాశాలను కల్పించింది. సరియైన విద్యావిధానం లేని (ఇస్లామిక్ విద్యను అభ్యసించిన) ప్రస్తుత తాలిబన్ల ప్రభుత్వం మహిళలకు విద్యను నిషేధించారు. శాస్త్రీయమైన విద్యను అమలుపరచడం లేదు. వారి పాలనలో  అశాంతి, అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. యునెస్కో చెప్పినట్లుగా ‘విద్య’ శాంతి స్థాపనలో  కీలక పాత్ర  పోషిస్తుంది. విద్య సమాజంలోని వ్యక్తుల మేధాశక్తిని పెంచడం వల్ల సమాజం పురోగతి చెందుతుంది.  

ప్రస్తుతం ఆన్ లైన్​లో ఆర్డర్ చేస్తే చాలు నిమిషాలలో స్విగ్గీ ఫుడ్ మన ఇంటికే వచ్చి కడుపు నింపుతుంది. అదే విధంగా ప్రస్తుతం విద్యా సంస్థలలో ప్రయోగశాలలు లేకపోయినప్పటికీ, పరిశోధనలు నిర్వహించనప్పటికీ,  పరిశోధనలకు గైడ్ లేనప్పటికీ  ఆన్​లైన్​లో పైసలు  చెల్లిస్తే చాలు  పరిశోధన పత్రాలను ప్రచురించే స్విగ్గీ ఫుడ్ ఆర్డర్  లాంటి సౌకర్యం  కూడా ప్రస్తుతం మన విద్యాసంస్థలలో విరివిగా అమలులో ఉంది. దీన్ని  ప్రభుత్వం కట్టడి చేస్తే మంచిది. లేకుంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ పరిశోధనల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. శాస్త్రీయమైన, నాణ్యమైన విద్యా విధానం సమాజంలో శాంతిని, సుస్థిరతను నెలకొల్పటంలో కీలకపాత్ర వహిస్తుంది.  

విద్యార్థులలో ప్రతిభ లేకపోవడానికి కారణం నాణ్యత లేని విద్యాసంస్థలు. స్కిల్స్ నేర్పమని డిమాండ్ చేయకుండా కేవలం అధికశాతం మార్కులతో డిగ్రీ పట్టా వస్తే చాలు అనే ఆలోచనలో విద్యార్థులు ఉండటం  కూడా ఒక  కారణం. అదేవిధంగా విద్యార్థుల దగ్గర ఎక్కువగా ఫీజులు వసూలు చేసి, తక్కువ వేతనాలకు వచ్చే నాణ్యతలేని ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించి ఏదోవిధంగా అధికశాతం మార్కులతో  విద్యార్థులను పాస్ చేసి డిగ్రీ పట్టాలు విద్యార్థుల చేతిలో పెట్టి బయటికి పంపిస్తే చాలులే అని విద్యాసంస్థలు  ఆలోచించడం మరొక కారణం.   

విద్యార్థులకు డిగ్రీలు పొందాలనే తాపత్రయం,  విద్యా సంస్థలకు డబ్బు సంపాదించుకోవాలని తాపత్రయం  తప్ప  విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవడం, నైపుణ్యాలు నేర్చుకోవటం అనే విషయాలను పట్టించుకోరు. నాలెడ్జ్ లేని ఉపాధ్యాయుడు నాలెడ్జ్ గల విద్యార్థులను తయారు చేయలేడు మరియు ‘మోటివేట్’ చేయలేడు. ప్రస్తుతం విద్యాసంస్థలలో విద్యార్థి  కనపరిచిన ప్రతిభ కన్నా ఎక్కువ మొత్తంలో మార్కులు ఇస్తున్నారు.ఈ కల్పిత  మార్కులను చూసి  విద్యార్థులు తాము ఎంతో నాలెడ్జ్ సాధించామని తప్పుగా అంచనా వేసుకుంటున్నారు. 

244 మిలియన్లకు పైగా పిల్లలు, యువతులు ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. పాఠశాలకు వెళ్లే 600 మిలియన్లకు పైగా పిల్లలు అక్షర, సంఖ్యాజ్ఞానం సాధించ లేకపోతున్నారు. ఎందుకంటే విద్యపట్ల అవగాహన లేకపోవటం, నాణ్యమైన విద్య అందకపోవటం జరుగుతోంది.అప్పట్లో మన ఊళ్లలోనే చదువుకోవటం ఎంత ముఖ్యమో చెప్పటానికి ‘అన్నాదమ్ముల నాటకం’ వేసి అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం చేసేవారు గుర్తుందా....మరి అలాంటిది సోషల్ మీడియా యుగంలో ఉన్న మనకి విద్య పట్ల అవగాహన వ్యాప్తి చేసే మార్గాలు చాలా ఉన్నాయి.  

పర్యావరణ సంరక్షణ, సాంకేతికత, ఆర్థిక సుస్థిరత వంటి అంశాలను విద్య ద్వారా నేర్పించాలి. ఈరోజు చదువుకోవాలనే తపన ఉన్నపేద పిల్లలకి ఆర్ధిక సాయం అందించే మార్గాలు చూపాలి. పనులకి వెళ్ళి చదువుకి దూరమైపోతున్న పిల్లల్ని గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించి, చదువుకి దగ్గర చేయాలి.‘అందరికీ విద్య-మనందరి భాద్యత’ అన్న మాటని అందరం నిలబెట్టుకోవాలి. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com