విభిన్న దర్శకుడు-తేజ

- February 22, 2025 , by Maagulf
విభిన్న దర్శకుడు-తేజ

తేజ..తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే ట్రెండ్ సృష్టించిన దర్శకుడాయన.. ఎవరు ఔనన్నా కాదన్నా ముక్కుసూటిగా, నిజాలు దైర్యంగా మాట్లాడే డైరెక్టర్ ఆయన. నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు.లైట్ బోయ్‌గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ. థియేటర్ లో ప్రతీ సీన్ కు ప్రేక్షకుల చేత కొట్టించడం ఆయన స్పెషాలిటీ....ఆయన ఇంకేవరో కాదు ప్రతి సినిమాలోనూ  కొత్త నటీనటులను పరిచయం చేస్తూ, వాళ్ళకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు తేజ..ఈ రోజు ఈయన బర్త్ డే

తేజ పూర్తి పేరు జాస్తి ధర్మ తేజ. 1966,ఫిబ్రవరి 22న మద్రాస్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి జె.బి.కె.చౌదరి ప్రముఖ వ్యాపారవేత్త మరియు చిత్రసీమతో సన్నిహిత సత్సంబంధాలు ఉండేవి. తేజ పినతండ్రి జాస్తి మాధవరావు ప్రముఖ మేకప్ మేన్. బాల్యంలోనే తల్లిదండ్రులు కన్నుమూయడంతో తేజ పలు పాట్లు పడి చివరకు కోరుకున్న చిత్రసీమలో అడుగు పెట్టారు. లైట్ బోయ్‌గా మొదలు పెట్టి అంచెలంచెలుగా ఇండస్ట్రీలో ఎదిగారు.

 చిత్రసీమ తేజకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. దాంతో పాటు సమతా భావాన్నీ అలవాటు చేసింది. అందుకే తేజ కులం, మతం, ప్రాంతం అన్నవాటిని ఏ మాత్రం విశ్వసించరు సరికదా, వాటికి ఆయన బద్ధ వ్యతిరేకి! రామ్ గోపాల్ వర్మ ఆరంభంలో తెరకెక్కించిన చిత్రాలకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి అలరించారు. రామ్ గోపాల్ వర్మ ‘రాత్రి’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాక బాలీవుడ్ బాట పట్టారు తేజ.

బాలీవుడ్‌లో తేజను మంచి మంచి అవకాశాలు పలకరించాయి. ఆమిర్ ఖాన్ హీరోగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన ‘బాజీ’ చిత్రానికి తేజ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాక, “గులామ్, సంఘర్ష్, జిస్ దేశ్ మే గంగా రహతా హై, క్రోధ్, క్రిష్ణ, రక్షక్, తేరే మేరే సప్నే” వంటి చిత్రాలకు ఛాయాగ్రహణ దర్శకునిగా అవకాశాలు లభించాయి. ఈ చిత్రాలతో తేజకు బాలీవుడ్ లో సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరు లభించింది. అదే సమయంలో మాతృభాష తెలుగులో దర్శకునిగా రాణించాలన్న ఆలోచన కలిగింది.

సినిమాటోగ్రాఫర్‌గా సక్సెస్ కొట్టిన తేజ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ‘చిత్రం’.ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నారు రామోజీరావు. ఈ నేపథ్యంలో ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ప్రతినిధులకు తేజ ఓ కథ వినిపించారు. యువతను ఆకట్టుకొనే అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్న ‘చిత్రం’ను నిర్మించడానికి రామోజీరావు నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘చిత్రం’ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇదే సినిమాతో రీమాసేన్ నాయికగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సినిమా విజయం తరువాత రామోజీ ఫిల్మ్ సిటీలో తేజ పరపతి పెరిగింది. ఆ సంస్థ నిర్మించిన కొన్ని చిత్రాలకు పర్యవేక్షకునిగానూ పనిచేశారు. తేజ రెండో సినిమా ‘ఫ్యామిలీ సర్కస్’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినా కమర్శియల్ గా ప్లాప్ అనిపించుకుంది. ‘ఫ్యామిలీ సర్కస్’ రిలీజైన యేడాదిలోనే వచ్చిన మరో చిత్రం ‘నువ్వు-నేను’. ఈ సినిమా యూత్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. కాలేజి కుర్రాళ్లు థియేటర్ల ముందు క్యూ కట్టేలా చేసింది. సినిమా కథ-కథనంతో పాటు, పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మొదటి సినిమా చిత్రంను మించిన హిట్టైయి, బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ సినిమా.అంతే కాదు నంది అవార్డుల పంట పండించింది.బయటకు వచ్చి ‘నువ్వు -నేను’ చిత్రం తెరకెక్కించారు తేజ. ఈ సినిమాకు జెమినీ కిరణ్ నిర్మాత. ఈ సినిమా రాబడిలో తేజ భాగస్వామ్యం తీసుకున్నారు. ఈ సినిమాల తర్వాత మళ్ళో సారి కొత్త నటీ నటులను పరిచయం చేస్తూ ‘జై’ అనే సినిమా చేశాడు. దీంతో పాటు నితిన్ తో ‘దైర్యం’, ఉదయ్ కిరణ్‌తో ‘ఔనన్మా కాదన్నా’ సినిమాలూ చేశాడు. వీటిల్లో జై, దైర్యం సినిమాలు ప్లాప్ ఐతే ఔనన్నా కాదన్నా పర్వాలేదనిపించింది.

తేజ చిత్రాలకు సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, గీత రచయిత కులశేఖర్ టీమ్‌గా పనిచేశారు. తొలి రెండు చిత్రాలతోనే విజయం సాధించిన ఈ టీమ్ తరువాత ‘జయం’ను తెరకెక్కించింది. ఈ సినిమా ద్వారా నితిన్ హీరోగా, సదా నాయికగా జనం ముందు నిలిచారు. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన తేజకు యూత్‌లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది.

మహేశ్ బాబు తేజ రూపొందించిన ‘నిజం’లో నటించి, ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించారు. ఆ తరువాత నుంచీ తేజ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తేజ పరిచయం చేసిన నటీ నటులు ,టెక్నీషియన్స్ తరువాతి కాలంలో ఇండస్ట్రీలో టాప్ పోజిషన్ కి చేరుకున్నారు, వీరిలో ఉదయ్ కిరణ్ ,నితిన్, రీమాసేన్, సదా, కాజల్ అగర్వాల్, నవదీప్, సుమన్ శెట్టి, చిత్రం శ్రీను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ లు కూడా ఉన్నారు. అలాగే చాలా మంది కమెడియన్లు,ఇతర నటీనటులు తమ కంటూ గుర్తింపును సోంతం చేసుకున్నారు.ఆ తర్వాత సినీ నేపథ్యంలో ‘ఒక విచిత్రం’, కళ్యాణ్ రామ్ హీరోగా ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాలకు దర్శకత్వం వహించాడు..ఒక విచిత్రం ప్లాప్ ఐతే లక్ష్మీ కల్యాణం యావరేజ్‌తో సరిపెట్టుకుంది.

తేజ పలు ప్రయత్నాలు చేసినా, ఎందుకనో అవి మునుపటిలా ఆకట్టుకోలేకపోయాయి. తేజ పని అయిపోయింది అన్నారు చాలామంది. అలా అన్నవారి నోళ్ళు మూయిస్తూ, 2017లో రానా, కాజల్ జంటగా తేజ “నేనే రాజు- నేనే మంత్రి” రూపొందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత అదే ఊపులో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమాను స్టార్ట్ చేసాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నారు తేజ. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను క్రిష్ చేపట్టాడు.

పాత కథను కూడా ‌కొత్తకోణంలో చెప్పి ఆకట్టుకోవడం తేజకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయత్నంలోనే సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్లాప్‌లు పలకరిస్తున్నా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసం తేజ సొంతంగా కింది స్థాయినుండి పైకి వచ్చిన తేజ జీవితంలో ఎన్నో ఆటు పోట్లను చూసిన తేజ...సినిమా ఇండస్ట్రీలోని ఆటుపోట్లనూ ధైర్యంగా ఎదుర్కుంటూనే డైరెక్టర్‌గా సత్తా చూపిస్తున్నారు.

   --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com