ప్రణయ్ పరువు హత్య కేసు–కోర్టు సంచలన తీర్పు

- March 10, 2025 , by Maagulf
ప్రణయ్ పరువు హత్య కేసు–కోర్టు సంచలన తీర్పు

తెలంగాణ: న‌ల్గొండ‌కు జిల్లాకు చెందిన ప్ర‌ణ‌య్ హ‌త్య కేసులో ఎ 2 నిందితుడు సుభాష్ శ‌ర్మ‌కు ఉరిశిక్ష విధించింది.. ఈ హ‌త్య కు స‌హ‌క‌రించిన మిగిలిన నిందితుల‌కు జీవిత ఖైదు ఖ‌రారు చేస్తూ నేడు న‌ల్గొండ ఎస్సీ ,ఎస్టీ కోర్టు తీర్పు వెలువ‌రించింది. వివ‌రాల‌లోకి వెళితే 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే ఊరికి చెందిన ప్రణయ్‌లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్‌ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. ఇక నేడు తీర్పు వెలువ‌రించింది.

ఎస్పీ రంగ‌నాథ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో…అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు, ప్రణయ్‌ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్స్‌ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు కేసు విచారణ జరిగింది. చార్జిషీట్‌ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్‌, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఇవాళ తుది తీర్పును వెలువరించింది.

ప్రణయ్‌ హత్య కేసులో A-1 మారుతీరావు, A-2 బిహార్‌కు చెందిన సుభాష్‌ శర్మ, A-3 అస్గర్‌ అలీ, A-4 అబ్దుల్లా బారి, A-5 ఎంఏ కరీం, A-6 శ్రవణ్‌ కుమార్‌, A-7 శివ, A-8 నిజాం. ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు ,అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో A-2 సుభాష్ శర్మ, A-3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్ పై విడుదలై కోర్టు విచారణకు హాజరయ్యారు. నేడు తీర్పు దృష్ట్యా కోర్టు వ‌ద్ద భారీగా బందోబ‌స్తు వెలువ‌రించారు.. తీర్పు వెలువ‌డిన త‌ర్వాత భారీ బందోబ‌స్తుతో దోషులంద‌రిని జైలుకు త‌ర‌లించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com