కాస్టింగ్ కౌచ్‌ పై ఫలించిన శ్రీరెడ్డి పోరాటం

- April 17, 2019 , by Maagulf
కాస్టింగ్ కౌచ్‌ పై ఫలించిన శ్రీరెడ్డి పోరాటం

కాస్టింగ్ కౌచ్‌ ఆరోపణలతో టాలీవుడ్‌ షేకయింది. శ్రీరెడ్డి పోరాటానికి ఎట్టకేలకు సర్కారు స్పందించింది. టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై కమిటీ వేసింది. బాధితులు కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు. ఇదంతా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు వర్తిస్తుంది. ఇక టాలీవులోకి అడుగు పెట్టడానికి ముందే కాస్టింగ్ కౌచ్‌ కోరలు చాచింది. నటన నేర్చుకుందామనుకున్న ఓ యువతికి వేధింపులు తప్పలేదు. మరి శిక్షణ పేరుతో వేధించే కీచకుల సంగతేంటి?

ఇదీ నటనలో ట్రైనింగ్ పేరుతో సాగుతున్న అరాచకం. చీకటి గదిలో సాగుతున్న కిరాతక శిక్షణ. నటన నేర్చుకోవాలంటే నగ్నంగా మారాలట. హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్‌నగర్‌లో వెలుగు చూసిన దారుణం ఇది. సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో… ఆ సంస్థ డైరెక్టర్ వినయ్ వర్మ నటన పేరుతో లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి షీ టీంకు కంప్లైంట్ చేసింది.

సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ అందమైన లోకంలో విహరించాలని ఎంతోమంది కలలు కంటారు. వాటిని నెరవేర్చుకోడానికి హైదరాబాద్ చేరుకుంటారు. నటనలో శిక్షణ తీసుకుంటే టాలీవుడ్‌లో అడుగు పెట్టొచ్చని ఆశపడతారు. కానీ నటన నేర్పే గురువే కీచకుడిగా మారుతాడని ఊహించలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ ఆరోణల్ని వినయ్ వర్మ కొట్టిపడేశారు. యాక్టింగ్ అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్తూనే.. ఆ యువతికి నటనలో అసలు ఇంట్రస్టే లేదంటున్నారు.

టాలీవుడ్‌లో లైంగిక వేధింపులను అరికట్టడానికి ప్రభుత్వం కమిటీ వేసిన టైంలోనే ఈ దారుణం వెలుగు చూసింది. కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా శ్రీరెడ్డి పెద్ద పోరాటమే చేసింది. ఎట్టకేలకు సర్కారు స్పందించి ప్యానల్‌ను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 984 విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఛైర్మన్‌గా ఉంటారు. ఇందులో టాలీవుడ్‌ ప్రతినిధులుగా నటి సుప్రియ, నటి కం యాంకర్ ఝాన్సీ, డైరెక్టర్ నందిని రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. మరికొంతమందినీ కమిటీలో నియమించారు. ఇదంతా ఇప్పటికే టాలీవుడ్‌లో లైంగిక వేధింపులకు గురైనవారు, వేధింపులు ఎదుర్కొంటున్నవారి కోసం. మరి ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండానే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో వేధింపులకు గురయ్యేవారి సంగతేంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకునే వారికి వేధింపుల అంశం కమిటీ పరిధిలోకి వస్తుందా లేదా అనేది తర్వాత విషయం. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్పందించాల్సింది పోలీసులే. షీటీం ఏసీపీ సూచనలతో కంప్లైంట్ చేయడానికి నారాయణ గూడ పీఎస్‌కు వెళ్తే… అక్కడ పోలీసులు లైట్ తీసుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

పోలీసులు సరిగా స్పందించలేదంటూ.. తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించడానికి ఆమె మీడియాను ఆశ్రయించింది. ఈ అంశం మీడియాలో రావడంతో ఎట్టకేలకు పోలీసులు వినయ్ వర్మపై కేసు నమోదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com