నా ఐరోపా యాత్ర - 3 (పోలాండ్)

- March 04, 2016 , by Maagulf

 

నేను ఒక్కడినే కావటంతో అదే సంస్థ లో పనిచేస్తున్న శశి అనే ఒక తమిళియన్ ఫ్లాట్ లో నాకు వసతి ఏర్పాటు చేసారు. టాక్సీ డ్రైవర్ సామాను తీసుకుని 4 వ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ కి తీసికెళ్ళాడు. ఇక్కడ అయిదు ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్ల కి కూడా లిఫ్ట్ లేదు. మెట్ల ద్వారానే బ్యాగ్ మోసుకుంటూ పైకి వెళ్లాను. ఈ శశి అనే వ్యక్తి కూడా ముద్రణా రంగంలో పట్టబద్రుడు. పరస్పర మిత్రుల ద్వారా అంతకుముందే ఫోన్ లో పరిచయం చేసుకోవటంతో మేము ఒకరికొకరం తెలుసు. ఆతను నాకంటే 6 నెలలు ముందు నుండే అక్కడ ఉంటున్నాడు. మేము కాకుండా మరో పదిమంది వరకు భారతీయులు అక్కడ అదే సంస్థలో పని చేస్తున్నారు. తెలుగువాడిని మాత్రం నేనొక్కడినే.

మేము నివసించిన అపార్ట్మెంట్స్ 

మింజు జెర్జ్ అనేది 20000 జనాభా గల ఒక చిన్న పట్టణం. మింజు జేర్జ్ అంటే పోలిష్ భాషలో రెండు నదుల మధ్య ఉండే ప్రాంతం అని అర్ధం. ఓబ్రా మరియు పాక్లిసా అనే రెండు నదులు పట్టణానికి ఇరువైపులా ప్రవహిస్తుంటాయి. ఇది పోలాండ్ కి పశ్చిమ భాగాన ఉంది. ఇక్కడినుండి జర్మనీ రాజధాని బెర్లిన్ 150 కిలోమీటర్లు మాత్రమే. 80 కిలోమీటర్ల లోనే జర్మనీ బోర్డర్ ఉంటుంది. పోలాండ్ రాజధాని వార్సా కి మాత్రం 500 కిలోమీటర్లు దూరం. అందుకే ఇక్కడి ప్రజలు బెర్లిన్ ఎయిర్ పోర్ట్ నే ఎక్కువ వినియోగిస్తుంటారు. నేను ఫ్లాట్ కి చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. అప్పటికి ఇంకా సూర్యాస్తమయం కాలేదు. ముందుగా చెప్పుకునట్లు వేసవి కాలంలో రాత్రి 10 గంటల వరకు సూర్యుడు ఉంటాడు. అదే చలికాలంలో అయితే మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. నేను వెళ్ళింది శుక్రవారం కావటంతో మరుసటి రెండు రోజులు సెలవు దినాలు. నేను వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ఇండియన్ మిత్రులు అందరూ ఆ రెండు రోజుల్లో కలిశారు. చిన్న చిన్న పోలిష్ పదాలు కొన్ని నేర్చుకున్నాను. (హాయ్ చెప్పాలంటే చేష్, థాంక్యూ అంటే జిన్కుయా, గుడ్ మార్నింగ్ అంటే జిందాబ్రే, ) పోలిష్ భాష చాలా కష్టమైనది. ఆ  పదాలని పలకటం చాలా కష్టం. కొంచెం ఓపిక, శ్రమ పడితే తప్పకుండా నేర్చుకోవచ్చు. మింజు జెర్జ్ అన్నీ సౌకర్యాలు గల మినీ పట్టణం. స్థానిక సంస్థలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తాయో ఇక్కడి పాలక వ్యవస్థ చూశాక అర్ధం అయ్యింది. మనం ఉండే నివాస ప్రాంతం వివరాలు వారంలోపుగా ఆయా మున్సిపాలిటీ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఊరుకి ఒక టౌన్ హాల్, మరియు స్క్వేర్ (కూడలి) తప్పనిసరిగా ఉంటాయి. అభివృద్ధి అంతా స్థానిక మేయర్లు ,ప్రజా ప్రతినిధుల చొరవతోనే జరుగుతుంది. పట్టణ మేయర్ ఒక సామాన్య వ్యక్తిలాగే నివసిస్తుంటాడు. ఎటువంటి హంగులు,ఆర్భాటాలు ఉండవు.

మింజు జెర్జ్ టౌన్ హాల్

ఇక్కడి ఆహరం బ్రెడ్ మరియు మాంసం. చికెన్ మరియు పోర్క్ ఎక్కువగా తింటారు. బర్గర్, పిజ్జా లు కూడా ఎక్కువే. మన వాళ్ళు ఇతరదేశాలకి వెళ్ళినపుడు ఆ రేట్లు అన్నీమన రూపాయల్లోకి లెక్కవేసుకుని చూసుకోవటం చాలామందికి అలవాటు. పోలాండ్ కరెన్సీ పేరు PLN . పోలిష్ భాషలో జిలోటి అంటారు. ఒక జిలోటి కి మన డబ్బులు 17 రూపాయలు వస్తాయి. యూరప్ దేశాలన్నీ ఒక్కటి అయినా, కరెన్సీ విషయంలో మాత్రం ఇంకా ఒక్కటి కాలేదు. యూరో చలామణీ లో ఉన్న దేశాల ఆర్ధిక వ్యవస్థలని చూశాక మిగతా దేశాల ప్రజలు యూరో విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. పోలాండ్ ప్రభుత్వం కూడా 2014 నాటికల్లా యూరోని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నా, ప్రజల నుండి ప్రతికూలత ఎదురవుతోంది. ఒకరకంగా ఐరోపా సమితి బలవంతంగా యూరోని అన్ని దేశాలమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఏకీకృత నగదు విధానం మంచిదే అయినా,దానిని ప్రవేశ పెట్టటంలో మాత్రం పాటించిన విధానాలు, కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలని పతనం చేశాయి. దానికి పెద్ద ఉదాహరణ గ్రీసు దేశం. యూరోని వాళ్ళ స్థానిక కరెన్సీకి సమాన విలువతో ప్రవేశ పెట్టటంలో విఫలం అవ్వటం వల్ల అక్కడి ప్రజల సంపద సగానికి సగం తరిగిపోయింది. వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు యూరోకి మారాక, ఇంతకుముందు కరెన్సీ ధరతో పోల్చుకుంటే రెట్టింపు అయ్యాయి. నేను చూసిన యూరప్ దేశాల్లో అత్యంత చవకైన దేశం పోలాండ్ మాత్రమే. అన్ని వస్తువుల ధరలు, ఆహార పదార్ధాల ధరలు మన రూపాయల్లో పోల్చి చూసుకుంటే దాదాపు ఒక్కటే. ఇక్కడి సూపర్ మార్కెట్లలో బియ్యం దొరుకుతాయి. కూరగాయలు మాత్రం పరిమితం. బంగాళా దుంపలు, టమోటాలు మనకంటే చవుక. ఏదైనా మన మసాలాలు, కూరగాయలు కావాలంటే వార్సాలో ఉన్న లిటిల్ ఇండియా అనే స్టోర్ నుండి తెచ్చుకోవాలి. మరో విశేషం ఏమిటంటే ఈ స్టోర్ నడుపుతోంది గన్నవరానికి చెందిన తెలుగువాడు కాట్రగడ్డ చందు. ఉన్నత విద్య కోసం 2007 లో పోలాండ్ వచ్చిన చందు ఇక్కడి స్థానిక యువతిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ఏదైనా కూరగాయలు, ఇండియన్ మసాలా లు కావాలంటే ఫోన్ చేసి చెప్తే చాలు మరుసటి రోజుకల్లా కొరియర్ లో వచ్చేస్తాయి. మన వాళ్ళంతా వేరే దేశాలకి వెళ్ళినపుడు కూడా మన ఆహరం కోసం వెతుకుతుంటారు. స్విట్జెర్లాండ్ వెళ్లి కూడా ఇడ్లీ,దోశ కోసం వెతకటంలో అర్ధం లేదనేది నా అభిప్రాయం. ఏ దేశపు ఆహారపు అలవాట్లైనా అక్కడి స్థానిక వాతావరణ పరిస్థితులు, అక్కడ నివసించే వాళ్ళ శరీరానికి అనుకూలంగా ఉండేటట్లు ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రాంతానికి వెళ్ళినపుడు అక్కడి ఆహరం తీసుకుంటేనే మన శరీరం ఆ వాతావరణానికి తగినట్లుగా అలవాటు అవుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ దొరికే ఆహారాన్ని తినటానికే ఆసక్తి చూపిస్తుంటాను.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com