సింగపూర్ లో శోభాయమానంగా ఉగాది ప్రత్యేక పూజలు,శ్రీవారి కళ్యాణ మహోత్సవం
- April 04, 2025
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మరియు రాబోవు సంవత్సరమంతా అందరికీ మేలు జరగాలనే మహా సంకల్పంతో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ,తోమాలసేవ, అభిషేకం , సహస్ర నామార్చన మరియు విశేష పూజలతో పాటు మహాలక్ష్మి, విష్ణుదుర్గ అమ్మవార్లకు మరియు ఆంజనేయ స్వామికి అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంనందు మార్చి 30, 2025 ఆదివారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా, గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు.
ప్రత్యేక శ్రద్ధతో సింగపూర్ తెలుగు సమాజం శోభాయమానంగా ఏర్పాట్లు చేయగా భారీగా తరలివచ్చిన భక్తకోటి ఆ దేవదేవున్ని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు మరుసటి రోజే ఉగాది రావటం విశేషం.కళ్యాణోత్సవం తరవాత శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ- తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపి,ఈ సంవత్సరం అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు.సింగపూర్ తెలుగు సమాజం స్వర్ణోత్సవాలు మే 11 న జరుగనున్నట్లు ప్రకటించి, అందరి సహాయ సహకారాలు కోరారు.
కళ్యాణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన తిరుమల లడ్డూ ప్రసాదం, తిరుమల కళ్యాణ తలంబ్రాలు, ఇతర మంగళ ద్రవ్యాలతో పాటుగా కార్యక్రమానికి గుర్తుగా ఒక జ్ఞాపికను అందచేసామని కార్యక్రమ నిర్వాహకులు అనిల్ పోలిశెట్టి తెలిపారు.
అలానే ఈ ఉగాది నాడు సింగపూర్ లోనే అరుదుగా లభించే వేప పువ్వు స్ధానిక తెలుగు వారికి ఉచితంగా అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని అందించామని, కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించామని, ఉదయం నుంచి సుమారు 5000 మంది భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యారని కార్యక్రమ నిర్వాహకులు తెలియచేసారు. స్ధానికులు కూడా ఉగాది పచ్చడిని సేవించి దాని విశిష్ఠతను తెలుసుకోవడం గమనార్హం.
కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గానికి, అర్చకులకు, దాతలకు, కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు,భక్తులకు, పంచాంగ పఠనం చేసిన పండితులకు, సేవాదళ సభ్యులకు, కార్యక్రమానికి హాజరైన మరియు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అందరికీ గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.తెలుగు సమాజ కమిటీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.




తాజా వార్తలు
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!







