హత్య చేసిన కేసులో తల్లికి ఉరి శిక్ష

- April 11, 2025 , by Maagulf
హత్య చేసిన కేసులో తల్లికి ఉరి శిక్ష

తెలంగాణ: ఏప్రిల్ 2021 లో, కోదాడ పోలీస్ డివిజన్,మోతే పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకలపాటి తండాలో నిందితురాలు అయిన బానోతు భారతి అలియాస్ లాస్య (32), తనకున్న సర్పదోషాన్ని తొలగించుకునేందుకు క్షుద్ర పూజకు తన కన్నకూతురును నరబలిగా ఇచ్చేందుకు ఏడు నెలల వయస్సు గల ముక్కుపచ్చలారని తన కూతురును దారుణంగా కత్తితో గొంతు కోసి  హత్య చేసింది. ఈ కేసులో అప్పటి మోతె యస్ ఐ ప్రవీణ్ కుమార్ (ఇప్పుడు మునగాల యస్ ఐ) ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి, పకడ్బందీగా FIR నమోదుచేసి ప్రాథమిక దర్యాప్తు చేపట్టి తదుపరి అప్పటి మునగాల సిఐ ఆంజనేయలుకు కేసును అప్పగించగా, ఆ తర్వాత తాను దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. 

కేసులో సాక్షుల వాంగ్మూలాలు మరియు భౌతిక సాక్ష్యాధారాల్ని పరిగనణలోకి తీసుకొని ఈ కేసును అరుదైన కేసులలో బహు అరుదైనదిగా భావిస్తూ  సూర్యాపేట జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు జడ్జి డా|| శ్యామా శ్రీ, కన్న కూతురిని హతమార్చిన నిందితురాలైన భారతికి ఉరి శిక్ష విదిస్తూ  తీర్పును ఇవ్వటం జరిగింది. 

దారుణమైన ఈ సంచలనాత్మక  కేసు విచారణ మొదలయినప్పటి నుండి కేసుకున్న  ప్రాధాన్యత దృష్ట్యా, జిల్లా యస్.పి  కొత్తపల్లి నరసింహ ప్రత్యేక శ్రద్ధ వహించి 
ప్రతిరోజు కోదాడ డి యస్ పి శ్రీధర్ రెడ్డి మరియు మునగాల సిఐ రామకృష్ణ రెడ్డి, అలాగే మోతే యస్ ఐ యాదవేంద్రలకు తగు సూచనలు సలహాలు ఇస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యన్ సవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ప్రాసిక్యూషన్ విచారణ గావించి కోర్టు ముందు పూర్తీ సాక్ష్యాధారాలతో కేసును నిరూపించి నిందితురాలైన భారతికి శిక్షాస్మృతిలోని అతి పెద్ద శిక్షైన ఉరి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.ఈ కేసు విచారణలో కోర్ట్ లైసన్ ఆఫీసర్ జి. శ్రీకాంత్, మోతె సి.డి.ఓ పిసి నాగరాజు ప్రత్యేక కృషి చేసారు.

ఈ కేసు అనంతరం కూడా నిందితురాలైన భారతి మరోమారు తన భర్త పై హత్యాయత్నం చేసింది. అట్టి కేసులో కూడా హుజుర్ నగర్ సబ్ కోర్టు  సదరు  నిందితురాలు భారతికి  ఏడాది జైలు శిక్ష విధించటం జరిగింది. 

ఈ సందర్బంగా ఆధునిక యుగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్న ఈ కాలంలో ప్రజలు ఈ  మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని జిల్లా యస్.పి కొత్తపల్లి నరసింహ కోరారు. ఇందు కొరకు పోలీస్ కళా జాతా బృందాలతో మారుమూల గ్రామాలు, ముఖ్యంగా గిరిజన తండాలలో" ప్రజా  భరోసా" కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా కృషి  చేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com