తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం

- April 24, 2025 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా నిర్ణయించబడింది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికే పాఠశాలలు ఒంటి పూట బడులుగా మారగా, బుధవారం రోజుతో పాఠశాలల తరగతులు ముగిశాయి.వార్షిక పరీక్షలు పూర్తి చేసిన పాఠశాలలు ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డులు విద్యార్థులకు పంపిణీ చేశాయి. ఇక విద్యా సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలన్నిటికీ వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి, పాఠశాలలు తిరిగి జూన్ 12వ తేదీన పునఃప్రారంభమవుతాయి.విద్యా సంవత్సరం ముగియడంతో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా తమ పాత పాఠశాలల్లోకి మళ్లీ చేరి విధులు ముగించారు. జిల్లా విద్యాధికారులు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వేసవి కాలం ప్రారంభమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమవడం జరిగింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా పాఠశాలలు ఒంటి పూట బడులుగా మార్చబడ్డాయి. ఈసారి విద్యార్థులకు మొత్తం 50 రోజుల పాటు సెలవులు లభిస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ ఇప్పటికే ప్రారంభమై ఉంది. జూన్ 12వ తేదీన విద్యార్థులకు ఈ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వేసవి సెలవులను విశ్రాంతిగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సెలవుల్లో వినోదాత్మక, బోధనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలనే సూచనలు వెలువడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com