మాస్టర్ బ్లాస్టర్-సచిన్ టెండూల్కర్
- April 24, 2025
సచిన్ టెండూల్కర్.. క్రికెట్లో ఇది పేరు కాదు ఓ బ్రాండ్. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని తన బ్యాటింగ్తో ఉర్రూతలూగించిన మాస్టర్ బ్లాస్టర్.. శిఖరాగ్ర స్థాయి రికార్డుల్ని నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో సచిన్ తనకంటూ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు. ‘క్రికెట్ గాడ్’, ‘లిటిల్ మాస్టర్’ అంటూ ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకునే సచిన్ రమేష్ టెండుల్కర్ ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ఒకరు. ఈరోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు.
సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. 1973, ఏప్రిల్ 24న ముంబాయిలో జన్మించాడు. తండ్రి రమేష్ టెండూల్కర్, సుప్రసిద్ధ మరాఠీ నవలా రచయిత, కవి. తల్లి రజని, ఆమె ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పని చేశారు. గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాతో సచిన్, స్టేడియానికి దగ్గరగా ఉండే పాఠశాలకు మారి క్రికెట్లో శిక్షణ తీసుకున్నాడు. క్రికెట్ పట్ల చిన్నతనంలోనే సచిన్ మక్కువ పెంచుకున్నాడు.
సచిన్ పాఠశాలలో చదువుతూ ఉన్నప్పుడు హ్యారీస్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలసి 1988లో 644 పరుగుల పార్ట్నర్షిప్తో రికార్డు సృష్టించాడు. 1988 డిసెంబర్ 11న వాంఖడే స్టేడియంలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో బొంబాయి తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్లోనే 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతి చిన్న వయసులోనే అరంగేట్రం మ్యాచ్లో సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పాడు.1989, నవంబరు 15న అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్.. 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్నాడు.
కొద్దీ వ్యవధిలోనే తన ఆట తీరుతో స్టార్ క్రికెటర్గా ఎదిగిపోయాడు. క్రమంగా భారత్ జట్టు పేరుని ఒకవైపు, సచిన్ టెండూల్కర్ పేరుని మరోవైపు బోర్డుపై రాసుకుని మరీ ప్రత్యర్థి టీమ్ బౌలర్లు వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగాడు. ప్రత్యర్థి, పిచ్, ప్రదేశంతో సంబంధం లేకుండా సచిన్ చెలరేగిన తీరుతో క్రికెట్ ప్రపంచమే పాదాక్రాంతమైంది.. బౌలర్లకి పీడకలల్ని మిగిల్చింది.
24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.79 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆడిన 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేసిన సచిన్.. 49 శతకాలు, ఒక ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? వన్డే క్రికెట్లో ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించింది సచిన్ టెండూల్కరే. 2010లో దక్షిణాఫ్రికాపై నమోదు చేశాడు. మొత్తంగా.. క్రికెట్ ప్రపంచంలో 100 అంతర్జాతీయ శతకాలు బాదిన సచిన్.. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవాలన్న సచిన్ కోరిక 2011లో నెరవేరింది. ధోని కెప్టెన్సీలో టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలిచింది. 2012లో వన్డే క్రికెట్కి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరుసటి ఏడాదే టెస్టులకు వీడ్కోలు పలికాడు. 25 టెస్టులు, 73 వన్డే మ్యాచ్లకు సచిన్ కెప్టెన్గా వ్యవహరించాడు. క్రికెట్లో ఉన్నత శిఖరాలు అందుకోవడానికి తన ముగ్గురు గురువులే కారణమని చెబుతుంటాడు. వారిలో ఒకరు తన తండ్రి రమేశ్ టెండూల్కర్ కాగా, మరొకరు తన అన్నయ్య అజిత్ టెండూల్కర్. ఇంకొకరు క్రికెట్ పాఠాలు నేర్పించిన రమాకాంత్ అచ్రేకర్. క్రికెట్ అనేది ఓ మతమైతే దానికి అతడో దేవుడని కీర్తిస్తుంటారు. క్రికెట్ లో అతడు సాధించని మైలురాయి లేదనే చెప్పాలి. ఇలా భారతీయ క్రికెట్లో ఓ వెలువెలిగిన లెజెండరీ ప్లేయరే సచిన్ టెండూల్కర్.
రిటైర్మెంట్ తర్వాత సచిన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని తరచూ పలకరిస్తున్నాడు. అప్పుడప్పుడు గరిటె తిప్పుతుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లలకు వంట చేసి పెడుతుంటాడు. ఈ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటాడు. సచిన్కి ముంబయి, బెంగళూరులో రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే ముంబయి, లండన్లో క్రికెట్ అకాడమీలూ ఉన్నాయి.తన అభిమాన నటులుగా సచిన్ అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, నానా పటేకర్ పేర్లు చెబుతాడు.
సచిన్కు 1994లో అర్జున అవార్డు, 1997/98లో ఖేల్ రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్, 2014లో భారతరత్న వరించాయి. అతను ఇంకా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. 2012లో సచిన్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యాడు. అంతే కాకుండా రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రీడాకారుడిగా సచిన్ గుర్తింపు పొందాడు. క్రికెట్లో తన అనుభవాలతో సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' అనే ఆత్మకథ రాశాడు. సచిన్ జీవితాన్ని 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీ మూవీగా మలిచారు. 2017లో ఈ మూవీ విడుదలైంది.
సమాజ సేవ చేయడంలోనూ సచిన్ ముందుంటాడు. ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్తో కలిసి పనిచేశాడు. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్లలో సచిన్ ఒకరు. ఎన్జీవోలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. సచిన్ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలంలోని పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకొన్నాడు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







