సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- April 30, 2025
విశాఖపట్టణం: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంగళవారం అర్థరాత్రి నుంచి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.
సింహాచలం ప్రమాద ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అక్కడి పరిస్థితిపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడటం జరిగిందని, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. కొద్దిసేపటికే ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాక.. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు సింహాచలం ప్రమాదం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. దుర్ఘటన దురదృష్టకరం అన్నారు. ఈ మేరకు జనసేన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
‘‘సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మృతుల వివరాలు..
1.పత్తి దుర్గాస్వామీ నాయుడు(32), తూర్పుగోదావరి జిల్లా
2.కుమ్మపట్ల మణికంఠ ఈశ్వరావు శేషరావు (28), తూర్పుగోదావరి జిల్లా
3.ఎడ్ల వెంకటరావు (48), అడవివరం
4.గుజ్జరి మహాలక్ష్మీ (65), హెచ్ బి కాలనీ, వెంకోజిపాలెం.
5.పైలా వెంకటరత్నం, హెచ్ బి కాలనీ, ఓల్డ్ వెంకోజిపాలెం.
6.పిళ్లా మహేశ్ (30), మధురవాడ చంద్రంపాలెం.
7. పిళ్లా శైలజ (26), మధురవాడ చంద్రంపాలెం.
విశాఖపట్టణంలోని మధురవాడ చంద్రంపాలెంకు చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ భార్యాభర్తలు. సాప్ట్ వేర్ ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









