బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవ వేడుక కాస్త విషాదంగా మారిన వేదన

- June 05, 2025 , by Maagulf
బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవ వేడుక కాస్త విషాదంగా మారిన వేదన

బెంగళూరు: ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్‌ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ స్పందించింది.సెలబ్రేషన్స్‌ను సరిగ్గా ప్లాన్‌ చేసి ఉండాల్సింది అంటూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌పై బీసీసీఐ(BCCI) ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం (జూన్ 4) బెంగళూరు నగరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకలను మరింత మెరుగ్గా ప్లాన్ చేసి ఉండాల్సిందని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయపడ్డారు. సన్నాహక లోపాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడటానికి దారితీసిన ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. 18 సంవత్సరాల తర్వాత RCB తొలిసారిగా IPL గెలిచినందున బెంగళూరులో ఇది చిరస్మరణీయమైన రోజుగా భావించారు, కానీ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి.

తీవ్ర గందరగోళానికి దారితీసింది
ఛాంపియన్ జట్టును చూసేందుకు చిన్నస్వామి స్టేడియం వెలుపల దాదాపు 2 లక్షల మంది అభిమానులు గుమ్మిగూడారు. పోలీసులు భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. “ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు క్రికెటర్ల పట్ల పిచ్చిగా ఉన్నారు. నిర్వాహకులు దీన్ని బాగా ప్లాన్ చేసి ఉండాలి. మృతుల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని సైకియా తెలిపారు. “ఇంత పెద్ద విజయోత్సవ వేడుకను నిర్వహించేటప్పుడు, సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్ ఇంత అద్భుతంగా ముగిసిన తర్వాత, ఇది యాంటీ-క్లైమాక్స్” అని ఆయన అన్నారు.

గత సంవత్సరం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీం ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ముంబైలో బీసీసీఐ నిర్వహించిన ఓపెన్ బస్ పరేడ్‌ను దేవజిత్ సైకియా ఉదహరించారు . ముంబైలో ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా ప్లాన్ చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టును స్వాగతించడానికి ముంబైలో భారీ సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ఆటగాళ్లను సత్కరించిన వాంఖడే స్టేడియం కూడా కిక్కిరిసిపోయింది. అయితే, ఈ కార్యక్రమం సరిగ్గా ప్లాన్ చేశారు. అందుకే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com