రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..
- June 16, 2025
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. రైతు నేస్తం వేదిక నుంచి ఆన్ లైన్ లో బటన్ నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేశారు. 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9వేల కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం అన్నారు. గతంలో పదవులు అనుభవించిన వాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని వారు వీధి నాటకాలకు బయలుదేరారని సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు.
పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు, చేతిలో చిప్ప పెట్టారని ధ్వజమెత్తారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితిని తెచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారని బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.
”అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం. మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్న బియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి.
పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనపైనే విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం, గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బతికే పరిస్థితి కల్పించాం.
చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. కొంత కాలమైనా సమయం ఇవ్వరా.. ? సరిదిద్దుకోనివ్వరా? భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం. రైతులకు సోలార్ పంపు సెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా.
రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరెన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గు లేకుండా మనల్ని విమర్శిస్తున్నారు” అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







