గచ్చిబౌలిలో ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- June 28, 2025
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది.శనివారం శేరిలింగంపల్లిలో శిల్పా లేఅవుట్ ఫేజ్-2 వద్ద నిర్మించిన కొత్త ఫ్లైఓవర్ను సీఎం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేశారు.
ఈరోజు (జూన్ 28న) ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ నగర ట్రాఫిక్ సమస్యల తగ్గింపులో భాగంగా కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు.శేరిలింగంపల్లితో పాటు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల ట్రాఫిక్ను సమర్థవంతంగా మేనేజ్ చేయడంలో ఇది ఉపయోగపడనుందని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ (PJR) సేవలను గుర్తు చేస్తూ ఆయన ప్రజల పక్షాన పోరాడిన నేతగా గుర్తింపు పొందారని సీఎం అన్నారు. హైదరాబాద్లో తాగునీటి సమస్యలు తొలగించడంలో పీజేఆర్ పోరాటం కీలకమని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ తన పాలనను ప్రజల కోసం అంకితమిస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం చేసిన ఒక ఆసక్తికర వ్యాఖ్య ప్రత్యేకంగా నిలిచింది. గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అనుమతులు లేకపోవడంతో హైడ్రా (HYDRA) అధికారులు ఆ కట్టడాన్ని కూల్చివేశారు. దాదాపు 3.3 ఎకరాల చెరువు భూమిని ఆక్రమించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
నటుడు అక్కినేని నాగార్జున స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు వచ్చి, చెరువు అభివృద్ధికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారని సీఎం వెల్లడించారు. “నగర అభివృద్ధిలో నేనూ ఒక హీరోలా ఉండాలనుకుంటున్నాను” అంటూ నాగార్జున చెప్పిన మాటలను సీఎం ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు ఇప్పుడు 24/7 జీవించే నగరాలుగా మారిపోయాయని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాంతాల నుంచే రాష్ట్రానికి అత్యధిక పన్నులు వసూలవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి దశల వారీగా కృషి చేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పాత్రను సీఎం రేవంత్ గుర్తు చేశారు. “ఒకప్పుడు హైటెక్ సిటీ, సైబరాబాద్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ వారు వేసిన పునాదులపైనే ఈరోజు నగర అభివృద్ధి నిలబడి ఉంది” అని అన్నారు.
హైదరాబాద్లో ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో ఎదురయ్యే సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. హైడ్రా ప్రాజెక్టు ద్వారా నాలాలు, చెరువుల పరిరక్షణ జరుగుతోందన్నారు. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు, CNG & EV ఆటోలు ప్రవేశపెట్టే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ వాహనాలపై పన్ను మినహాయింపు ఇస్తున్నామని గుర్తు చేశారు.
2029 నాటికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలుగా విస్తరించే అవకాశం ఉందని సీఎం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యేలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తే, ప్రభుత్వం పూర్తి మద్దతుతో నిధులు విడుదల చేస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







