ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

- July 09, 2025 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించారు.

మంత్రివర్గం తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఇవి:

  • నేలపాడులోని శాసనసభ్యులు, మండలి సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారుల కోసం నిర్మిస్తున్న 432 నివాస సముదాయాల పనులను వేగవంతం చేయాలని.. మిగిలిన పనుల కోసం రూ. 524.70 కోట్లు మంజూరు చేయగా, వీటిని ‘లంసమ్ కాంట్రాక్ట్’ పద్ధతిలో చేపట్టనున్నారు.
  • CRDA పరిధిలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపు నిబంధనలను, నియంత్రణలను సమీక్షించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • కృష్ణా నదిలోని వివిధ రీచ్‌లలో, ప్రకాశం బ్యారేజీ ముందు భాగంలో రూ. 286.20 కోట్లతో ఇసుక తొలగింపు పనులకు ఆమోదం లభించింది. ఈ పనులను APCRDA చేపట్టనుంది.
  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ కింద కుడి ప్రధాన కాలువ స్లూయిస్‌ల అత్యవసర మరమ్మతులకు రూ. 22.50 లక్షలు మంజూరు చేశారు.

పారిశ్రామిక అభివృద్ధి, విమానాశ్రయాలు:

  • ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కు కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమానాశ్రయాల అభివృద్ధికి రూ.1000 కోట్ల రుణాన్ని HUDCO నుండి సమీకరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  •  అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ సరిహద్దులను మార్చడానికి, AMNSI ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన భూములకు బదులుగా అదనంగా 790 ఎకరాల భూమిని సేకరించడానికి, మొత్తం 2001.80 ఎకరాల భూమిని AP బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు బదిలీ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది.
  • 2025–30 కాలానికి స్పేస్ రంగ అభివృద్ధి కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • నెల్లూరు జిల్లాలో BPCL పెట్రోలియం రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ తయారీ ప్రాజెక్ట్, రామయ్యపట్నం పోర్ట్ రెండో దశ కోసం భూసేకరణను వేగవంతం చేయడానికి కందుకూరు, కావలిలో స్పెషల్ కలెక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది.
  • పల్నాడు జిల్లా, గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట వీరాంజినేయులుకు జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 1న అమరావతిలో సౌత్ ఆసియాలోనే మొదటి క్వాంటమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీకి రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్ర మ్యాచింగ్ షేర్ కోసం అవసరమైన రూ.10,000 కోట్లను రుణాల ద్వారా సమీకరించడానికి “ఆంధ్రప్రదేశ్ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్” స్థాపనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

  • ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963కి సవరణలు చేస్తూ రవాణా వాహనాలపై ‘గ్రీన్ ట్యాక్స్’ రేటును తగ్గించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఏడేళ్లు దాటిన వాహనాలకు భారీగా పెంచిన పన్నులను ఇప్పుడు రూ. 1,500 నుంచి రూ. 3,000/-కు తగ్గించారు. దీని ద్వారా 9,56,429 మంది వాహనదారులకు లబ్ధి చేకూరనుంది.
  • కార్మిక సంస్కరణలలో భాగంగా వినిమయ భారాన్ని తగ్గించడం, డీ రెగ్యులేషన్ చేయడం కోసం ఆంధ్ర ప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం, 1988కి సవరణలను మంత్రివర్గం ఆమోదించింది.
  • రాజధాని నిర్మాణం కోసం భూములను కోల్పోయి జీవనోపాధి కోల్పోయిన 1575 కుటుంబాలను ప్రత్యేక కేసుగా పరిగణించి, వారికి నిరుపేద పింఛను ప్రయోజనాన్ని తిరిగి విస్తరించడానికి APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • మామిడి, కోకో రైతులకు మద్దతు ధర

కోకో రైతులకు కిలోకు రూ. 50/- చొప్పున రూ.14.884 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుత సీజన్‌లో అమ్ముడుపోని 2976.76 మెట్రిక్ టన్నుల కోకో గింజలను సేకరిస్తారు. ప్రస్తుత సీజన్‌లో మామిడి రైతులకు లాభదాయక ధరలు అందించడానికి, చిత్తూరు జిల్లాలో మామిడి సాగును కొనసాగించడానికి కిలోకు రూ. 4/- చొప్పున మొత్తం రూ. 260.00 కోట్లు మంజూరు చేశారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని సేకరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com