విదేశీ మీడియా పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం

- July 21, 2025 , by Maagulf
విదేశీ మీడియా పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆగ్రహం

న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదం పై పాశ్చాత్య దేశాల మీడియా  దానికన్నా ఎక్కువగా ఊహాగానాలతో వార్తలు రాస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆగ్రహం వ్యక్తం చేశారు.తుది నివేదిక రాకముందే పైలట్లు సహా ఇతరులపై బేస్ లేని ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.ఈ ప్రమాదంపై ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది—తుది నివేదిక వెలువడే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదు.రామ్మోహన్ నాయుడు మీడియాను కూడా ఇదే దిశగా ముందుకెళ్లాలని కోరారు. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్ డేటా విజయవంతంగా డీకోడ్ చేయడంలో ఏఏఐబీ సత్తా చాటింది.మునుపు బ్లాక్ బాక్స్ డేటా డీకోడ్ కోసం విదేశాలకు పంపాల్సి వచ్చేది. కానీ ఈసారి భారతదేశంలోనే పూర్తి చేయడం గర్వకారణం అని మంత్రి వివరించారు. ప్రాథమిక నివేదిక సిద్ధంగా ఉందని, అయితే తుది నివేదిక వచ్చేదాకా స్పష్టమైన ప్రకటనలేవీ చేయబోమన్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి సంస్థలు ఆధారాల్లేని కథనాలతో పైలట్లపై నిందలు వేస్తుండడాన్ని మంత్రి తప్పుబట్టారు. దీనిపై AAIB కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ మీడియా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది.అమెరికా రవాణా భద్రతా మండలి (NTSB) చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెండీ కూడా ఈ కథనాలను ఊహాగానాలుగానే కొట్టిపారేశారు. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నామని, విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

జూలై 17న ఏఏఐబీ విడుదల చేసిన ప్రకటనలో అంతర్జాతీయ మీడియాలోని అవాస్తవ కవర్‌జ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్ర మంత్రి మీడియాను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. “ఊహాగానాల వలన తప్పుడు భావనలు ఏర్పడతాయి. అందరూ సంయమనం పాటించాలి,” అని నాయుడు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com