బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు..

- July 19, 2016 , by Maagulf
బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు..

బోనాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు రూ.7కోట్లు వ్యయం చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. బోనాల ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు సీపీ మహేందర్‌రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా అదనంగా 500మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారని, ఆరు మొబైల్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.
బోనాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇతర శాఖలతో పోలీసుశాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు.బోనాల వూరేగింపు మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణకు షీ బృందాలు, గొలుసు దొంగతనాల వ్యతిరేక బృందాలను నియమిస్తామన్నారు. బోనాల కోసం 3వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ప్రజలు నమ్మొద్దని.. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని వర్గాలు పోలీసులకు సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కమిషనర్‌ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com