క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి

- September 17, 2025 , by Maagulf
క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి

విజయవాడ: క్రీడల ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియా ఖేలో పుట్ బాల్ తో ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందని, ఇదొక మైలురాయిగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి యువ ప్రతిభను వెలికితీయడం, సాధికారత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఇండియా ఖేలో ఫుట్‌బాల్ (IKF)తో కలిసి "టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్" కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట పర్యవేక్షణలో 45 రోజులపాటు ఫుట్‌బాల్ రోడ్‌షో జరుగనుంది. విశాఖపట్నం, రాజమండ్రి, సత్తెనపల్లి, విజయవాడ, కర్నూలు, అనంతపురం, తిరుపతి వంటి ఏడు ప్రధాన నగరాలకు  చేరుకోనున్న రోడ్ షోలో పదికి పైగా చిన్న పట్టణాల్లో ఫుట్‌బాల్ ట్రయల్స్, క్లినిక్స్, పేరెంట్ వర్క్‌షాప్‌లు, బాలికలకు సాధికారత కల్పించే సెషన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎండీ ఆమ్రపాలి పర్యాటక శాఖ ద్వారా తన సహకారాన్ని అందించనుంది. తద్వారా పర్యాటక రంగానికి ప్రచారం కూడా లభిస్తుందని తాము భావిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, ఐఏఎస్ మాట్లాడుతూ పర్యాటకం అంటే కేవలం ప్రదేశాలు చూడటమే కాదు, ప్రజల కథలను, వారి సంస్కృతిని గొప్పగా చాటి చెప్పడమన్నారు. 'స్కౌట్ ఆన్ వీల్స్' కు మద్దతు ఇవ్వడం ద్వారా తాము ఫుట్‌బాల్‌తో పాటు యువ సాధికారతను, ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.'ఫుట్‌బాల్ ద్వారా ఆంధ్రాను కనుగొనండి' అనే నినాదంతో రాష్ట్రానికి ఉన్న పర్యాటక అవకాశాలకు, సంస్కృతికి, యువ శక్తికి కేంద్రంగా నిలుపుదాం" అని పిలుపునిచ్చారు.

టైగర్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈఓ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, 'స్కౌట్ ఆన్ వీల్స్'కు టైటిల్ పార్టనర్‌గా ఉండటం తమకు గర్వకారణం అన్నారు. ఒక  ఎన్ బీఎఫ్ సీగా, ఆర్థిక స్వేచ్ఛతో కమ్యూనిటీలకు సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తమ 27 బ్రాంచ్‌ల వాలంటీర్లు తల్లిదండ్రులు, క్రీడాకారులతో నేరుగా కలిసి వారికి ఆర్థిక అక్షరాస్యతను, యువతకు అప్రెంటిస్‌ షిప్‌లను, కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారని పేర్కొన్నారు. ఇది కేవలం రుణాలు ఇవ్వడం కాదు, కుటుంబాలకు కలలు కనే స్వేచ్ఛను ఇవ్వడం కూడా అని ఆయన వెల్లడించారు.

IKF వ్యవస్థాపకుడు ఫణి భూషణ్ మాట్లాడుతూ ఫుట్‌బాల్ భారతదేశంలోని ప్రతి ఇంటికీ చెందాలని తాము నమ్ముతామన్నారు. 'స్కౌట్ ఆన్ వీల్స్'ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం ద్వారా, ఫుట్‌బాల్ అవకాశాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాదని మేము నిరూపిస్తున్నామన్నారు. ఇది క్రీడాకారులను గుర్తించడం, అమ్మాయిలకు సాధికారత కల్పించడం, తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం, అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్‌ను ఫుట్‌బాల్ ఆడే రాష్ట్రంగా తీర్చిదిద్దడం అన్నారు. ఈ ప్రయాణంలో తమతో కలిసినందుకు టైగర్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

ఎటువంటి లాభాపేక్ష లేని ఇండియా ఖేలో పుట్ బాల్ నిర్వహించే కార్యక్రమం ద్వారా 1,000కి పైగా క్రీడాకారులకు వృత్తిపరమైన అవకాశాలు లభించేందుకు అవకాశముంది. అంతేగాక 2,000కు పైగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే సెషన్లు నిర్వహించనున్నారు. 300కు పైగా బాలికలకు ఆరోగ్యం, పోషకాహారం, క్రీడల పై వర్క్‌షాప్‌ల ద్వారా సాధికారత కల్పించనున్నారు. ఇప్పటికే ఈ సంస్థ కెరీర్ 360 కార్యక్రమం ద్వారా యువ ప్రతిభను గుర్తించి వారికి భద్రతతో కూడిన భవిష్యత్ ను అందించింది. త్వరలోనే అన్ని నగరాలకు సంంధించిన రిజిస్ట్రేషన్లు ఐకేఎఫ్ వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి. అదే విధంగా టూరిజం సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సంబంధిత వివరాలు అందుబాటులో ఉండనున్నాయి.11 నుండి 17 సంవత్సరాలు గల క్రీడాకారులు ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com