యూఏఈ: ఇండియాలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ను కష్టాలు విడవడం లేదు. విమాన సర్వీసుల రద్దుతో దుబాయ్ మరియు ముంబై మధ్య సర్వీసులు ప్రభావితం అయ్యాయి. కొంతమంది ప్రయాణీకులు తక్కువ వెయిటింగ్ తో బయటపడుతుండగా, మరికొందరు 10 గంటలు వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. గురువారం రాత్రి ముంబైకి విమానంలో ప్రయాణించడానికి తన బంధువు ఒకరు దాదాపు 10 గంటలు వెయిటింగ్ చేశాడని దుబాయ్ నివాసి మహమ్మద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ రాత్రి 10 గంటలకు బయలుదేరిందని పేర్కొన్నాడు.
యూఏఈ నుండి బయలుదేరే అనేక ఇతర ఇండిగో విమానాలు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి.శుక్రవారం ఉదయం 3:20 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్-కోజికోడ్ విమానం చివరికి ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఆలస్యంతో ఉదయం 11:29 గంటలకు బయలుదేరింది. ఉదయం 11:45 గంటలకు బయలుదేరాల్సిన కొచ్చి ఇండిగో విమానం 30 నిమిషాల తరువాత మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5:15 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్-అహ్మదాబాద్ విమానం ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళ్లింది. అయితే, విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రభావితం అయిన ప్రయాణికులకు ఇండిగో బహిరంగ క్షమాపణ చెప్పింది.