తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- December 27, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.నేరాలు, రౌడీయిజం, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించి నేరాలను ముందుగానే అరికట్టాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలని, విజువల్ ఆధారాలతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాజకీయ ముసుగులో బెదిరింపులు, సెటిల్మెంట్లు, రౌడీయిజానికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ వంటి నిర్ణయాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.
తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో, నిందితులపై పీడీ యాక్టులు ప్రయోగించడంలో చూపుతున్న చొరవను కొనియాడారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు() విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడే సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల ఉనికి కనిపిస్తూ, మరోవైపు నేరస్తులకు తెలియకుండా గట్టి నిఘా ఉండేలా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే సొంత పార్టీ వారైనా జైలుకు పంపే సంస్కృతి తమదేనని మరోసారి గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









