తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- December 27, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.నేరాలు, రౌడీయిజం, అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించి నేరాలను ముందుగానే అరికట్టాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలని, విజువల్ ఆధారాలతో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. రాజకీయ ముసుగులో బెదిరింపులు, సెటిల్మెంట్లు, రౌడీయిజానికి పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ వంటి నిర్ణయాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.
తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుపతి ప్రాంతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో, నిందితులపై పీడీ యాక్టులు ప్రయోగించడంలో చూపుతున్న చొరవను కొనియాడారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు() విమర్శించారు. రోడ్లు బ్లాక్ చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడే సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లతో పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల ఉనికి కనిపిస్తూ, మరోవైపు నేరస్తులకు తెలియకుండా గట్టి నిఘా ఉండేలా వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే సొంత పార్టీ వారైనా జైలుకు పంపే సంస్కృతి తమదేనని మరోసారి గుర్తుచేశారు.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు









