జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం

- December 29, 2025 , by Maagulf
జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో జరిగిన జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించాలంటే కేంద్రం–రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పాలన, సేవల డెలివరీ, తయారీ రంగాల్లో నాణ్యత, శ్రేష్ఠతే వికసిత్ భారత్‌కు గుర్తింపని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భాగస్వాములై సమన్వయంతో ముందుకు సాగితేనే దేశం ఆశించిన ఫలితాలు సాధిస్తుందని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సమావేశం సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత బలపరిచే కీలక వేదికగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశీయ తయారీని బలోపేతం చేయడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలని ప్రధాని సూచించారు. ఆర్థిక స్థిరత్వం కోసం దేశీయంగా తయారు చేయాల్సిన 100 కీలక ఉత్పత్తులను గుర్తించాలని రాష్ట్రాలకు సూచించారు. త్వరలో ప్రారంభించనున్న జాతీయ తయారీ మిషన్‌కు రాష్ట్రాలు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ సూత్రాన్ని మరింత బలోపేతం చేస్తూ, మేడ్ ఇన్ ఇండియాను గ్లోబల్ ఎక్స్‌లెన్స్‌కు ప్రతీకగా నిలపాలని చెప్పారు. సులభతర వ్యాపార విధానాలు అమలు చేస్తే భారత్ ప్రపంచ సేవల కేంద్రంగా ఎదుగుతుందన్నారు.

భారత్ యువత శక్తితో ముందుకు సాగుతున్న దేశమని మోదీ(PM Modi) ప్రశంసించారు. యువతను శక్తివంతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉన్నత విద్యలో నాణ్యమైన ప్రతిభను సృష్టించేందుకు విద్యాసంస్థలు–పరిశ్రమలు కలిసి పనిచేయాలని సూచించారు. ఉపాధి సృష్టిలో పర్యాటకం కీలక పాత్ర పోషించగలదని పేర్కొంటూ, భారత్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాలు రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. ఈ ఏడాది థీమ్‌గా ‘మానవ మూలధనం’ను ఎంపిక చేసినట్లు వెల్లడిస్తూ, పేదల సాధికారత, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు సమిష్టి కృషి అవసరమన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com