వెనిజులా పై అమెరికా దాడి.. స్పందించిన భారత్
- January 04, 2026
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆ దేశ దళాలు.. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశంలో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా, వెనిజులా మధ్య నెలకొన్న తాజా వివాదంపై భారత్ మొట్టమొదటిసారిగా స్పందించింది. ఈ విషయంలో భారత్ ఆ ప్రాంతంలో శాంతిని కోరుకుంటున్నట్లు తెలిపింది. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా చర్యను బహిరంగంగా ఖండించినప్పటికీ.. భారత్ మాత్రం ప్రధానంగా మన దేశ పౌరుల భద్రత, చర్చల ద్వారా ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపాలనే అంశాలకే పరిమితమైంది. వెనిజులా రాజధాని కరాకస్పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత.. ఆదివారం మధ్యాహ్నం భారత్ ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులాలో వేగంగా మారుతున్న పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని.. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది.
సమస్యలను సంబంధిత పక్షాలు అన్నీ చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ హితవు పలికింది.ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అదే సమయంలో ఆ దేశంలో ఉన్న భారతీయుల భద్రతపైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెనిజులాలోని భారతీయ పౌరుల క్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత అని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. వెనిజులాలో ఉన్న 80 మందికి పైగా భారతీయులతో (50 మంది ఎన్ఆర్ఐలు, 30 మంది పీఐఓలు) కరాకస్లోని భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు.. భారతీయులకు ప్రయాణ హెచ్చరికలు కూడా విదేశాంగ శాఖ చేసింది. వెనిజులాకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. భారత ప్రభుత్వం తన పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగ ఉండాలని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







