భారత్లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది..
- January 04, 2026
న్యూ ఢిల్లీ: గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి దేశంలోనే మొట్టమొదటి ఏఐ (కృత్రిమ మేధస్సు) క్లినిక్ను ప్రారంభించింది. ఆరోగ్య రంగంలో ఏఐను వాడడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్లినిక్ ఏఐ, జన్యు స్క్రీనింగ్ను వినియోగించి క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేస్తుంది.
రక్త పరీక్షల విశ్లేషణ, స్కాన్లు, జన్యు డేటా ద్వారా వ్యాధుల అంచనా వేస్తుంది. జన్యు స్క్రీనింగ్ అంటే జన్యు సమాచార ఆధారంగా వ్యాధి ప్రమాదాన్ని గుర్తించే పరీక్ష విధానం. మానవ మేధస్సు తరహాలో రోగ విశ్లేషణ సామర్థ్యం ఏఐకి ఉండడంతో భవిష్యత్తులో వైద్య రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
జీఐఎంఎస్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ రాకేశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. “రక్త పరీక్షలు, ఇమేజింగ్ స్కాన్లు, ఇతర క్లినికల్ డేటా వంటి సమాచారాన్ని కృత్రిమ మేధస్సు, జన్యు స్క్రీనింగ్ ద్వారా విశ్లేషిస్తాం” అని చెప్పారు. రోగుల సంరక్షణ మెరుగుదల దిశగా ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లు, ఎంఆర్ఐ నివేదికలు, ప్రయోగశాల పరిశోధనలను ఏఐ సాధనాలు విశ్లేషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఆరోగ్య స్టార్టప్లకు కొత్త అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు.
AI క్లినిక్ అంటే ఏంటి?
అధునాతన అల్గోరిథమ్లు, ఆటోమేషన్ ద్వారా నిర్ధారణ, చికిత్స, రోగి నిర్వహణను మెరుగుపరచేలా ఏఐ క్లినిక్ రూపకల్పన ఉంటుంది. రోగి లక్షణాలను తగిన సమయంలో విశ్లేషించేందుకు ఏఐ వ్యవస్థలు సహకరిస్తాయి. దూర ప్రాంతాలు, సేవలు తక్కువగా ఉన్న గ్రామీణ భారత ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడటం ఏఐ క్లినిక్ల ప్రధాన లాభం.
ఏఐ క్లినిక్లు ఏం చేస్తాయి?
ఏఐ అల్గోరిథమ్లు ఎక్స్రేలు, సీటీ స్కాన్లు, ఎంఆర్ఐలను విశ్లేషిస్తాయి. విరిగిన ఎముకలు, ఊపిరితిత్తుల ముద్దలు, సూక్ష్మ ట్యూమర్లు వంటి వాటిని సంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా గుర్తించవచ్చు. అత్యవసర కేసులకు ప్రాధాన్యం ఇవ్వడానికి వైద్యులకు సాయం చేస్తుంది. ఫలితంగా రోగులు వెయిట్ చేసే సమయం తగ్గుతుంది, చికిత్స ఫలితాలు మెరుగవుతాయి. రేడియాలజిస్టుల సామర్థ్యం 40% వరకు పెరుగుతుంది. ప్రాణాపాయ సమస్యలను ఏఐ వెంటనే గుర్తిస్తుంది.
పాథాలజీలో ఏఐ
కణజాల విశ్లేషణ ఆటోమేషన్ ద్వారా పాథాలజీ రంగాన్ని ఏఐ మార్చేస్తుంది. మానవ కళ్లకు కనిపించని వ్యాధి నమూనాలు గుర్తిస్తుంది. ఏఐతో కూడిన డిజిటల్ పాథాలజీ సంక్లిష్ట కేసుల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. అర్జెంట్ కేసులపై పాథాలజిస్టులు దృష్టి పెట్టేందుకు ఇది వీలు కల్పిస్తుంది. క్యాన్సర్ ప్రారంభ దశ గుర్తింపులో ఏఐ బాగా ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా









