లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- January 24, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో శనివారం జరిగిన ఉత్తరప్రదేశ్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ది చెందిన తాజ్ మహల్, శ్రీకృష్ణుని జన్మస్థలం అయిన మధుర, శ్రీరాముని జన్మస్థలం అయోధ్య, గంగా,యమునా,సరస్వతి పవిత్ర నదుల త్రివేణి సంగమం వంటి అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. కాశీ విశ్వనాథ ఆలయం ఉన్న గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందిందని మరియు ప్రపంచంలోని పురాతనమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుందని, దాదాపు 3,000 సంవత్సరాల పురాతనమైనదని ఆయన అన్నారు.
దాద్రా నగర్ హవేలీ ప్రకృతి సౌందర్యానికి నిలయం అని, మంత్రముగ్ధులను చేసే పర్యాటక ప్రదేశాలకు, పచ్చని అడవులు, అద్భుతమైన జల తీరాలు, సుదూర పర్వత శ్రేణులు, వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క అందమైన మరియు ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతమని గవర్నర్ అన్నారు. డామన్ మరియు డయ్యూ బహుముఖ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు గిరిజన, భారతీయ, పోర్చుగీస్ మరియు యూరోపియన్ వివిధ సంస్కృతుల సమ్మేళనాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' కార్యక్రమం 'ఒక దేశం ఒకే ప్రజలు' అనే భావన ద్వారా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర చర్యను పెంపొందించడం మరియు పరస్పర అవగాహనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.
ముందుగా, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ శాసన మండలి సభ్యుడు అవనీష్ కుమార్ సింగ్ తన సందేశాన్ని అందించారు. తరువాత, లేఖ్య భరణి కథక్ నృత్య ప్రదర్శనలు, పాలపర్తి నాగేశ్వరరావు, కుమార్ బాబు మరియు మధు బాబుచే హిందూస్థానీ సంగీత వాయిద్యాల జుగల్బంది, శివానీ భారతిచే దేశభక్తి గీతం, ఐకాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే సమూహ నృత్యం ప్రత్యేక ఆకర్షణలుగా అతిధులను అలరించాయి .
గవర్నర్ గారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి. అనంత రాము, జాయింట్ సెక్రటరీ శ్రీ పి.ఎస్. సూర్య ప్రకాష్ మరియు లోక్ భవన్ అధికారులు మరియు సిబ్బంది, విజయవాడ మరియు చుట్టుపక్కల ఉన్న వివిధ విద్యా సంస్థలలో చదువుతున్న ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







