సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు

- March 11, 2026 , by Maagulf
సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన  59 మంది తెలుగు ప్రవాసులు

బహ్రెయిన్: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ లో చిక్కుకున్న 59 మంది తెలుగు ప్రవాసులు APNRTS, ఎన్ఆర్ఐ టిడిపి సంయుక్త సహకారంతో మంగళవారం రాత్రి క్షేమంగా బయలు దేరారు.సౌదీ అరేబియా డమ్మాం ఎయిర్ పోర్టు నుంచి వారు విమానంలో పయనమయ్యారు. యుద్ధం కారణంగా తాత్కాలికంగా నిలిచిన విమానాల రాకపోకలు పాక్షికంగా పునఃప్రారంభమైన నేపథ్యంలో, గత 10రోజులుగా బహ్రెయిన్ తో పాటు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 59 మంది ఆక్కడ నుంచి సురక్షితంగా బయలు దేరారు. 

అక్కడ చిక్కుకున్న వారి పరిస్థితి మొదట బహ్రెయిన్ లోని ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS), ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి తెలిసింది. వెంటనే వారు  అధికారులకు సమాచారం అందించి తక్షణ సహాయం కోరారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, APNRTS చైర్మన్ వేమూరి రవికుమార్, సీఈఓ కృష్ణమోహన్ రంగంలోకి దిగి ఆయా దేశాల్లోని గుడ్ విల్ రాయబారులను అప్రమత్తం చేశారు.

గల్ఫ్ కౌన్సిల్ ఎన్ఆర్ఐ టిడిపి విభాగ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కూడిన ఆరు గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం సుమారు 100 మంది ఏపీఎన్ఆర్టిఎస్ గుడ్ విల్ రాయబారులు చురుకుగా పనిచేస్తున్నారు.ఈ వాలంటీర్లు ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన తెలుగు వారికి ట్రాన్జిట్ వీసాల జారీకి సహకారం అందించారు. సౌదీ అరేబియాలోని డమ్మాం నుంచి విమానాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వారికి స్థానిక రవాణాను కూడా ఏర్పాటు చేశాం.చిక్కుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి వ్యక్తిగత వాహనాలు, ఇతర లాజిస్టిక్ సపోర్ట్ అందించినట్లు రాధాకృష్ణ చెప్పారు.

తెలుగు పౌరులను సురక్షితంగా తరలించడానికి బహ్రెయిన్ టీమ్ సభ్యులు రఘునాథ్ బాబు, హరిబాబు, శివకుమార్, సతీష్ షెట్టి, మోహన్, సతీష్ బోళ్ళ, జగదీష్, బాలకృష్ణ, సౌదీ టీమ్ సభ్యులు ఖలీద్, సైఫుల్లా, జానీ షేక్, రంజిత్, ముజామిల్, జాకీర్, సారథి సహకారం అందించారు. తాము క్షేమంగా స్వస్థలాలకు వెళ్ళడానికి సహకారం అందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, APNRTS టీమ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత రాయబారులు, బహ్రెయిన్, సౌదీ ఎన్ఆర్ఐ టిడిపి నాయకులకు సౌదీ నుంచి బయలుదేరిన తెలుగు పౌరులు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com