యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!

- January 26, 2026 , by Maagulf
యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!

యూఏఈ: యూఏఈ-ఇండియా ఎయిర్ కారిడార్‌లో ఫ్లైట్స్ కొరత వేంటాడుతోంది. దీంతో సీట్లకు డిమాండ్ పెరగడం వల్ల విమాన ఛార్జీలు భారీగా ఉంటున్నాయి.  ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ కంపెనీ టూరిజం ఎకనామిక్స్ కొత్త విశ్లేషణ ప్రకారం, రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ ఇప్పుడున్న ఉన్న సామర్థ్యాన్ని అధిగమించనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్లైట్ సర్వీసుల సంఖ్య మారకపోతే, రెండు దేశాల మధ్య అంచనా వేస్తున్న ప్రయాణీకుల డిమాండ్‌లో దాదాపు 27 శాతం 2035 నాటికి తీరకపోవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

2026 మరియు 2035 మధ్య దాదాపు 54.5 మిలియన్ల ప్రయాణీకుల ప్రయాణాలకు కొరత ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఉటంకిస్తున్నారు.  ఇప్పటికే ప్రధాన మార్గాల్లో 80 శాతం డిమాండ్ మించిపోయింది. అబుదాబి-ఇండియా కారిడార్ లో రాబోయే దశాబ్దంలో 13.2 మిలియన్ల మంది ప్రయాణికులకు ట్రాన్స్ పోర్టు కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు, భారతదేశ విమానయానం వేగంగా పెరుగుతోంది. విమాన ప్రయాణానికి తగినంత ఆదాయం ఉన్న కుటుంబాలు 2010లో జనాభాలో 24 శాతం ఉండగా, 2024లో 40 శాతానికి చేరారు. దీని వలన దాదాపు 300 మిలియన్ల మంది ప్రయాణీకులు కొత్తగా పెరిగారని నివేదిక తెలిపింది. 2035 వరకు ఏటా 7.2 శాతం విమానయానం డిమాండ్ పెరుగుతుందని, ప్రతి సంవత్సరం దాదాపు 22 మిలియన్ల అదనపు ప్రయాణీకుల ప్రయాణాలకు సిద్ధమవుతున్నారని అంచనా వేస్తున్నారని టూరిజం ఎకనామిక్స్‌లో కన్సల్టింగ్ డైరెక్టర్ మాథ్యూ దాస్ తెలిపారు.  భారత మార్గాల్లో డిమాండ్ ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కంటే ఎక్కువగా ఉందని డీరా ట్రావెల్ & టూరిస్ట్ జనరల్ మేనేజర్ సుధీష్ టిపి అన్నారు. యూఏఈ -భారత్ మధ్య అంతర్జాతీయ విమానయాన మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. నవంబర్ 2025 నాటికి, ఈ కారిడార్ లో దాదాపు 1.1 మిలియన్ నెలవారీ సీట్లు అంటే 27 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన థాయిలాండ్ కేవలం 9 శాతం మాత్రమే ఉంది. భారత్-యూఏఈ మార్గంలో సామర్థ్యం సంవత్సరానికి 3 శాతం పెరిగినప్పటికీ, వృద్ధి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా లేదని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

2024లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం 92.3 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. వీరిలో దుబాయ్ –ఇండియా మధ్య దాదాపు 12 మిలియన్ల మంది ప్రయాణించారు. ఆరు ప్రధాన క్యారియర్లు దుబాయ్ మరియు 23 భారతీయ గమ్యస్థానాల మధ్య వారానికి 538 విమానాలను నడుపుతున్నాయి.  ఈ కారిడార్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన వాటిలో ఒకటిగా నిలిపింది. ఎమిరేట్స్ మార్కెట్‌కు వెన్నెముకగా ఉంది.

దుబాయ్‌ను తొమ్మిది భారతీయ నగరాలకు అనుసంధానిస్తూ 167 వీక్లీ సేవలను నిర్వహిస్తోంది. అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారత్ లో 11 గమ్యస్థానాలకు విస్తరించింది.  అదే సమయంలో భారతీయ క్యారియర్లు కూడా వేగంగా పెరిగాయి. ఇండిగో భారత్- యూఏఈ మధ్య దాదాపు 220 వీక్లీ సేవలను నిర్వహిస్తోంది. ఎయిర్ ఇండియా వారానికి 82 విమానాలను నడుపుతుండగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ కారిడార్‌లో అతిపెద్ద భారతీయ ఆపరేటర్ గా ఉంది. ఇది యూఏఈలోని పలు గమ్యస్థానాలకు 240 కంటే ఎక్కువ వీక్లీ విమానాలను నడుపుతోంది.  ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే ఐదేళ్లలో భారత్-యూఏఈ విమాన మార్గం జీడీపీకి సహకారం ఏటా సుమారు 3 శాతం మేర పెరుగుతుంది. ఆంక్షలను సడలిస్తే ఈ వృద్ధి 5.5 శాతం నుండి 7 శాతం వరకు పెరగవచ్చు. ఒక్క అబుదాబి-భారత్ మార్గంలోనే సీట్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తే, ఐదేళ్లలో అదనంగా 7.2 బిలియన్ డాలర్ల జీడీపీని సృష్టించవచ్చు. సగటున ఏటా 170,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు మద్దతు ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com