విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం

- February 01, 2026 , by Maagulf
విజయవాడలో వైభవంగా \'వివేకానంద మానవ వికాస కేంద్రం\' ప్రారంభోత్సవం

అమరావతి: రామకృష్ణ మిషన్ అంటే విలువలు నేర్పే విశ్వవిద్యాలయం...సమాజ నిర్మాణానికి శక్తి కేంద్రమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడించారు.రామకృష్ణ మిషన్ నేతృత్వంలో నిర్మితమై ప్రారంభించుకున్న 'వీహెచ్ఈసీ' కేవలం భవన నిర్మాణం కాదు..శీలసంపదకు నిలయం..సాక్షాత్తు దేవాలయంగా ఆయన అభివర్ణించారు. యువత భవితకు 'వీహెచ్ఈసీ' ఒక విజ్ఞాన దీపికగా వెలుగులు పంచుతుందని మాజీ ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్ లో రూ.8.5 కోట్లతో నిర్మించిన వివేకానంద మానవ వికాస కేంద్ర ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వీహెచ్ఈసీ భవనంలోని రెండో అంతస్తులో రామకృష్ణ మిషన్ సర్వాధ్యక్షులు గౌతమానంద మహరాజ్ భక్తి, దేశభక్తి వంటి అంశాలపై చేసిన ఇచ్చిన ప్రవచన సందేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత  మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన పుస్తక విక్రయశాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.బీజేపీ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి భవన నిర్మాణ ఫలకాన్ని గౌతమానంద మహరాజ్ సహా స్వామీజీల సమక్షంలో ఆవిష్కరించారు.అనంతరం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రామకృష్ణ మిషన్ భక్తుల సమక్షంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..పుస్తక విక్రయశాలను తన చేతుల మీదుగా ప్రారంభం కావడం తనకు దక్కిన మహాభాగ్యమని వెంకయ్యనాయుడు ప్రసంగించారు.  

వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ప్రారంభించిన పరమపూజ్య శ్రీమత్ గౌతమానంద మహరాజ్ ప్రసంగిస్తూ..విజయవాడ రామకృష్ణ మిషన్ తో తనకుగల 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీతానగరంలో రామకృష్ణ మిషన్ స్కూల్ ఎంతో బాగా నడుస్తుందని మెచ్చుకున్నారు. విద్యతోనే ప్రతి మనిషి తన కల నిజం చేసుకుంటారన్నారు.సంస్కారం లేని చదువులు ప్రస్తుత సమాజంలో ఎక్కువగా కనపడుతున్నాయన్నారు. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే చదువులు అనివార్యమన్నారు. శ్రీరామకృష్ణుల వారు పెద్దగా చదువుకోకపోయినా అందర్ని సమానంగా ప్రేమించడం, దైవ మార్గం వైపు నడిపించడంలో చేసిన కృషి ఎంతో ఉందన్నారు.ప్రతీది తాను సాధన చేసిన తర్వాతే పరులకు చెప్పే గొప్ప వ్యక్తిత్వం శ్రీరామకృష్ణులవారిదన్నారు. పేరు, కీర్తి, సంపాదన, శారీరక సుఖాలను త్యాగం చేసి ప్రతి జీవికి సేవ, సాయం చేయాలన్న గురువు రామకృష్ణుల సందేశాన్ని స్వామి వివేకానంద  ఆచరించి చూపారన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని త్రిమూర్తుల జ్ఞాపికతో సత్కరించారు. స్వామిజీల ప్రసంగం అనంతరం రామకృష్ణ మిషన్ కు విరాళాల రూపంలో దానం, సాయం చేసిన దాతలను స్వామీజీలు శాలువా, పుష్పగుచ్ఛాలనిచ్చి సన్మానించారు. ఆ తర్వాత మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సినీ దర్శకులు కొరటాల శివను శ్రీమత్ గౌతమానంద మహరాజ్ సన్మానించారు.భవనినిర్మాణం పనుల పూర్తికి కృషి చేసిన వారిని సైతం సత్కరించారు. ఆ తర్వాత విజయవాడ రామకృష్ణ మిషన్ సహాయ కార్యదర్శి శితికంఠానందస్వామిజీ ప్రసంగించిన వక్తల మాటలను గుర్తు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించారు.

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ..98 ఏళ్ల వయసులో బేలూరు మఠం నుంచి విచ్చేసి వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని పావనం చేసిన గౌతమానంద మహరాజ్ అంకితభావాన్ని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. 1965లో పెన్మత్స బాపిరాజు నేతృత్వంలో రామకృష్ణ సమితిగా ప్రారంభమై, మిషన్ లో భాగస్వామ్యం చేసిన కృషి మరువలేనిదన్నారు. 

విజయవాడ రామకృష్ణమిషన్ కార్యదర్శి వినిశ్చలానంద స్వామి మాట్లాడుతూ..గతంలో కార్యదర్శిగా పని చేసి ఇలాంటి భవ్య భవంతి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన శశికాంతానంద, హృదానంద స్వామీజీల చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ వివేకానంద హ్యున్ ఎక్సలెన్స్ సెంటర్ ను చిన్నారులు,యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జూన్ నుంచే భవనంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే దిశగా మందుకెళుతున్నామన్నారు.దాతల విరాళంతోనే ఈ కల సాకారమైందన్నారు. అందుకే శిలాఫలకాలపై వారి పేర్లను , ఇచ్చిన కానుకను భావితరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశామన్నారు.

స్వామి శశికాంతానంద మహరాజ్ మాట్లాడుతూ..దివిసీమ ఉప్పెన కాలం నుంచి మొన్న విజయవాడ వరదల సమయంలోనూ రామకృష్ణ మిషన్ నిస్వార్థ సేవలందించిందన్నారు. రజతోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంతో పాటు అద్భుతనాంద స్వామి జయంతి సందర్భంగా ఇవాళ ఈ వికాస కేంద్రం ప్రారంభించుకున్నట్లు తెలిపారు.వామన రూపంలో బలిచక్రవర్తిని దానమడిగిన కథను  పోల్చుతూ రామకృష్ణ మిషన్ ఎదిగిన తీరును ఆసక్తికరంగా వివరించారు. ఆసక్తికర కథలతో సమాజంలో నేటి పరిస్థితులను ఆద్యంతం ఆలోచించే విధంగా ఆయన ప్రసంగించారు.

అనంతరం స్వామి హృదానంద మహరాజ్ మాట్లాడుతూ..కోవిడ్ సమయంలోనూ గాంధీనగర్ లోని వివేకానంద మానవ వికాస కేంద్రం, సీతానగరంలో ధ్యానాలయం ఏర్పాటు కోసం కృషి చేసిన విషయాలను గుర్తు చేశారు. దైవ సంకల్పం,భక్తుల సహకారంతో రామకృష్ణుల వారు ఎక్కడున్నా అనుకున్నది సాధిస్తారని ప్రసంగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com