వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు

- February 13, 2026 , by Maagulf
వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు

హైదరాబాద్: విఖ్యాత ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బి.వి. పట్టాభిరామ్ జయంతిని ప్రతి ఏటా “ఇంద్రజాల దినోత్సవం”గా గుర్తించాలని ప్రముఖులు ప్రభుత్వాలను కోరారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు నలభై మందికి పైగా ఇంద్రజాలికుల భిన్నమైన మాయాజాల ప్రదర్శనలతో అద్భుతంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, పట్టాభిరామ్ శిష్యరికంలో ఎందరో ఇంద్రజాలికులు ఎదిగి స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఆయన జయంతిని అధికారికంగా ఇంద్రజాలికుల దినోత్సవంగా గుర్తించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ, తెలుగు ఇంద్రజాలికులకు పట్టాభిరామ్ ఒక గురువు, మార్గదర్శి అని పేర్కొన్నారు. ప్రముఖ సంపాదకుడు కె. రామచంద్ర మూర్తి పట్టాభిరామ్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ, 1990 తర్వాత తెలుగు ఇంద్రజాల రంగంలో పట్టాభిరామ్ విశిష్ట స్థానాన్ని సంపాదించారని, ఉత్తమ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎందరో జీవితాలను ప్రభావితం చేశారని తెలిపారు.

వంశీ రామరాజు మాట్లాడుతూ, పట్టాభిరామ్ పేరిట ప్రారంభించిన తొలి అవార్డును ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు ప్రకటించారు. కార్యక్రమంలో చొక్కాపు రమణ, జర్నలిస్ట్ వల్లీశ్వర్, వాణి ఉప్పల, పట్టాభిరామ్ సతీమణి జయ,ఫణి మాధవ్ కస్తూరి, కుమారుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సుంకరపల్లి శైలజ పర్యవేక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com